నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. అయితే.. రూ. 2.25 -రూ. 2.30 లక్షల కోట్ల మధ్యలో 2021-22 వార్షిక బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేయనుంది ఏపీ సర్కార్. సామాజిక పెన్షన్ను రూ. 2500కు పెంచనున్న ప్రభుత్వం… పెంచిన సామాజిక పెన్షన్ను జనవరి నుంచి అమలు చేయనుంది. 45-60 ఏళ్ల లోపు మహిళలకు ఈబీసీ నేస్తం కోసం కేటాయింపులు చేస్తుండగా… ఈ ఏడాది బడ్జెట్ పై అప్పుల ప్రభావం కన్పించటం లేదు. గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలు, పాత బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక కేటాయింపులు చేస్తోంది ఏపీ సర్కార్. అప్పులు చేసైనా సంక్షేమ పథకాలు అమలు చేసేలా బడ్జెట్ రూపకల్పన చేయనుంది సర్కార్. ఏపీలో తొలిసారిగా జెండర్ బడ్జెట్ పెట్టనుంది సర్కార్. మహిళలు.. పిల్లలకు ఎంత ఖర్చు పెట్టనున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనుంది ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, మండలిలో మంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.