Minor Girl Murder: మదనపల్లెలో సైకో కులవర్థన్ చేతిలో హత్యకు గురైన చిన్నారికి నేడు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లె గ్రామంలో చిన్నారి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక, ఈ కేసులో నిందితుడు కులవర్థన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిన్నటి నుంచే ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నప్పటికీ కులవర్థన్ ఆనవాళ్లు మాత్రం ఇంకా దొరకలేదు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి సైకోను ఎన్ కౌంటర్ చేయాలంటూ మదనపల్లెలో స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.