ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో పాటు సాగునీటి అవసరాల కోసం ఏపీ ఇండెంట్ ఉంటేనే విద్యుత్ ఉత్పత్తికి అస్కారం ఉందన్న ఏపీ.. ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదని స్పష్టం చేసింది.
ఇక, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడాన్ని నిలువరించాల్సిందిగా కేఆర్ఎంబీని కోరింది ఆంధ్రప్రదేశ్.. కృష్ణా డెల్టాలో నీటి అవసరాలపై ఏపీ ఇండెంట్ ఇస్తేనే ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేసింది.. రాష్ట్ర విభజన అనంతరం నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు భౌగోళికంగా తెలంగాణ భూభాగంలో ఉండిపోయాయని స్పష్టం చేసింది.. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు నీటి విడుదల యాధృశ్చికమని పేర్కొన్న ఏపీ ఈఎస్సీ… తెలంగాణ రాష్ట్రానికి ఈ రెండు ప్రాజెక్టుల దిగువన తాగు, సాగునీటి అవసరాలేమీ లేవని లేఖలో రాసుకొచ్చింది. నాగార్జున సాగర్ దిగువన ఏపీకి సాగునీటి అవసరాలు ఉంటేనే నీటిని విడుదల చేసి ఉభయ రాష్ట్రాలు విద్యుత్ ను వినియోగించుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.