High Court: భూకబ్జా కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయగా.. తనపై నమోదైన భూ ఆక్రమణ కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను బుధవారం నాడు హైకోర్టు విచారించింది. సీఐడీ విచారణ కొనసాగించుకోవచ్చు కానీ.. ఈ కేసు విషయంలో అయ్యన్నపాత్రుడిపై నమోదు చేసిన సెక్షన్ 467 వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also: Heroines Education : టాప్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా?
తన క్లెయింట్పై ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 467 నమోదు చేశారని.. ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మరోవైపు సీఐడీ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ అయ్యన్నపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను బెదిరించడం, భయపెట్టడం వంటివి చేశారని.. అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని చెప్పారు. కానీ హైకోర్టు మాత్రం సెక్షన్ 467 వర్తించదని తీర్పు చెప్పింది. అటు జల వనరుల శాఖ ఇచ్చిన ఎన్వోసీ.. విలువైన పత్రాల కేటగిరి కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సెక్షన్ వర్తించనందున.. సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో విశాఖ కోర్టు అయ్యన్నపాత్రుడిని రిమాండ్కు పంపేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.