Gorantla Madhav NBW: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు పెద్ద షాక్ తగిలింది. ఆయనపై పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలతో గోరంట్ల మాధవ్పై గతంలోనే పోక్సో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు గోరంట్ల మాధవ్ హాజరు కాకపోవడంతో విజయవాడలోని పోక్సో కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. మైనర్ బాలికకు సంబంధించిన సున్నితమైన వివరాలను బహిరంగంగా వెల్లడించడం పోక్సో చట్టానికి విరుద్ధమని అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై కోర్టు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మాధవ్ హాజరు కాకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ను రీకాల్ చేయాలని కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు గోరంట్ల మాధవ్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read Also: Tamannaah: బోల్డ్ సీన్లు చేయనందుకు ఆ స్టార్ హీరో నన్ను అవమానించాడు.. తమన్నా ఆవేదన!