RK Roja: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు పేరుతో జరుగుతున్న కార్యక్రమం అసలు ప్రజా సమస్యలపై చర్చించకుండా “దగానాడు”గా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసేలా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని రోజా ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రకటించిన “సూపర్ సిక్స్”, “సూపర్ సెవెన్” హామీలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మోసాల మానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందన్నారు.
జూన్ 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ప్రజలకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నట్లు రోజా తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. “ఈ రెండేళ్లలో మీరు ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉందా?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని, ఇప్పుడు అలాంటి వ్యక్తినే పార్టీ అధ్యక్షుడిగా నియమించారని నారా లోకేష్ పై రోజా విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
మహిళలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన రోజా, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు గతంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. “నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పుడే అమలు చేసి ఉండాలి కదా” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే సరైన తీర్పు ఇస్తారని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా..
