Jayamangala Venkataramana: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీ లాబీల్లో చిట్చాట్ సందర్భంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.. తన రాజకీయ ప్రస్థానంపై మాట్లాడిన ఆయన, “నా దేవుడు ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే.. ఉదయం నిద్రలేవగానే ఆయన ఫోటోకు దండం పెడతాను.. ఈ మాటను ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను” అని అన్నారు.
Read Also: Miss India- Miss Universe : టాలీవుడ్ తెరపై మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ బ్యూటీఫుల్స్
ఇక, 20 ఏళ్లు పార్టీ కోసం పనిచేశాను.. ఎవరు ఏం చేయలేదు.. కానీ, పిలిచి పిల్లని ఇచ్చినట్టు పిలిచి పదవి ఇచ్చింది జగన్ గారే అన్నారు జయమంగళ… అప్పుల్లో కూరుకుపోయిన నన్ను కోలుకునేలా చేశారు అని పేర్కొన్నారు. తన రాజకీయ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, “రాజకీయాల్లో నాది శకుని పాత్ర” అన్నారు. 2014 ఎన్నికల సందర్భాన్ని ప్రస్తావిస్తూ, “అప్పుడు నాకు కాకుండా కామినేనికి టికెట్ ఇచ్చారు. నేను పోటీ చేసి ఉంటే అప్పుడే మంత్రి అయ్యేవాడిని” అని తెలిపారు. అలాగే జిల్లాలో కొల్లు రవీంద్ర కంటే తాను సీనియర్నని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
కాగా, 2023లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన జయమంగళ.. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే 2024 నవంబర్లోఎమ్మెల్సీ పదవికి, వైసీపీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. అయితే తన రాజీనామాపై మండలి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి..