Minister Anitha: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత… రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు, పరిశ్రమల కోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా ప్రతిపక్షం మాత్రం ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడకుండా పరామర్శ యాత్రల పేరుతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తోందని మంత్రి ఆరోపించారు. జగన్ బయటకు వచ్చిన ప్రతిసారీ విధ్వంసం, అరాచకం జరుగుతోందని విమర్శించారు. మహిళలపై దాడులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బాధ్యతాయుతమైన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, బలప్రదర్శనలతో రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
పోలీసులను బెదిరించేలా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రతిపక్ష నేతల వ్యవహారం ఉందని మంత్రి అనిత ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో నిందితులను పరామర్శించేందుకు వెళ్తున్నారని, అయితే బాధిత కుటుంబాలను పరామర్శించడంలో ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. సిదిరి అప్పలరాజు కుమారుడు దానయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందినా, ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమని, విధ్వంస రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని మంత్రి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం శాంతి, అభివృద్ధి, పెట్టుబడులే అవసరమని, ప్రజలు వాస్తవాలను గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

