NTV Telugu Site icon

CM Chandrababu: సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ దేవుడే నా నోట నిజాలు చెప్పించాడేమో..?

Babu

Babu

CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. రామతీర్థంలో రాములవారి విగ్రహం తల తొలిగిస్తే దిక్కులేదు.. కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలా ఒక్కటని కాదు.. నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులేదు అన్నారు.. నాటి ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్లతో ఆడుకున్నారు. ప్రజల మనోభావాలకు గత ప్రభుత్వం విలువ ఇవ్వలేదు. పోలవరం, అమరావతి నాశనం చేసి.. వాటిపైనా ఎదురు దాడి చేసి తప్పుడు ప్రచారం చేశారు. బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో.. నేడు ప్రకాశం బ్యారేజ్ కు బోట్ల విషయంలో అలాగే మాట్లాడుతున్నారు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చాను అన్నారు..

Read Also: CS Shanti Kumari: ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి.. అధికారులతో సీఎస్ సమీక్ష..

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా.. బుకాయించే వాళ్లను ఏమనాలి? అని నిలదీశారు చంద్రబాబు.. రూ. 320 కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుంది..? శ్రీవారికి నైవేథ్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి? పరమ పవిత్ర పుణ్యక్షేత్రం విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి కదా! తప్పు చేసింది కాక.. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని సిగ్గు లేకుండా ఎలా చెపుతారు..? అంటూ ఫైర్‌ అయ్యారు.. ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయమని కొత్త ఈవోకు చెప్పాను.. ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. లడ్డూ నాణ్యత పెంచారు. పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారు. లడ్డూ నాణ్యత కోసం నందిని నుంచి నెయ్యి కోనుగోలు చేశారు. ఈవో ప్రక్షాళన చేశారు.. కానీ ఇవన్నీ రోజూ బయటకు వచ్చి చెప్పలేదు. పని చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడే నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో..? మనం నిమిత్త మాత్రులం. దేవుడే అన్నీ చేయిస్తాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..

Read Also: Janasena Vs TDP Flex War: జనసేన వర్సెస్‌ టీడీపీ..! ఒంగోలులో ఫ్లెక్సీల రగడ

ఇక, టీటీడీ విషయంలో తదుపరి ఏం చెయ్యాలి.. ఎలా చెయ్యాలి అనేది చర్చిస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తాం. ఇప్పటికే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాం అన్నారు.. అయితే, వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? అని ప్రశ్నించారు.. తిరుమలలో ఏం సంప్రదాయాలను వీళ్లు పాటించారు. తిరుమల సెట్ ఇంట్లో వేసుకున్నవాడిని ఏమనాలి? కేరళ గురవాయూర్ టెంపుల్ లో చొక్కా విప్పి వెళ్లాలి.. అది సాంప్రదాయం. అందరూ పాటించాలి. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి.. వాటిని ప్రతి ఒక్కరు గౌరవించాలి. శ్రీవారి లడ్డూ కంటే బాగా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు.. కానీ, సాథ్యం కాలేదు. 1817 నుంచి శ్రీవారి లడ్డూ అక్కడ తయారు అవుతోంది. ఆయోధ్యలో కూడా తిరుమల లాంటి లడ్డూ తయారు చేయాలని చూశారు. కానీ, సాధ్యం కాలేదు. రోజూ మూడు సార్లు పరీక్షలు చేశాం అని ఎవరిని మభ్యపెడుతున్నారు. గతంలో వైఎస్ ఏడు కొండలను రెండు అన్నాడు.. అప్పుడు వ్యతిరేకించాం.. పోరాడాం.. అమరావతితో రూ. 250 కోట్లతో శ్రీవారి టెంపుల్ కడదాం అనుకుంటే దాన్ని కుదించారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పరీక్షలు, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతాం. వరద బాధితులకు వేగంగా సాయం అందేలా చేస్తాం. మానవీయ కోణంలో సాయం అందిస్తున్నాం అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..