AP Helpline: పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. సహాయక చర్యల విషయంలో ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ కలిసి పనిచేయాలని, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సీఎం చెప్పారు. కేంద్రం ద్వారా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, అందరూ సురక్షితంగా ఉండేలా చూడాలని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఎయిర్ పోర్టులు మూసివేయడం, విమాన సర్వీసుల రద్దుతో వెంటనే రాష్ట్రానికి తిరిగి వచ్చే పరిస్థితులు లేనందున, పరిస్థితులు చక్కబడేవరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, దీనికి ఏపీ ఎన్ఆర్టీ సహకరిస్తుందని సీఎం చెప్పారు.
హెల్ప్ లైన్ నెంబర్ 0863-2340678
గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీతో కలిసి చర్యలు చేపట్టింది. వారికి సహాయం కోసం 0863-2340678 హెల్ప్ లైన్ నెంబర్, 85000 27678 వాట్సప్ నెంబర్ను 24 గంటలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ ఎన్ఆర్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. ప్రవాసాంధ్రులు సంప్రదించిన వెంటనే ఏపీ ఎన్నార్టీ వారికి తక్షణం సహాయ, సహకారాలు అందించేలా ఏర్పాట్లు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు helpline@apnrts.com, support@apnrts.com, info@apnrts.com ఈ మెయిళ్లు, https://apnrts.ap.gov.in వెబ్సైట్ను కూడా సంప్రదించవచ్చు. ఈ సమీక్షలో ఆర్టీజీఎస్ అధికారులు, ఎన్ఆర్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.