Tragedy : ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో జరిగిన హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతుండగా వధువు మరణించింది. తన హల్దీ వేడుకలో నృత్యం చేస్తూ ఉండగా, బాత్రూమ్కు వెళ్లిన 22 ఏళ్ల యువతి గుండెపోటుతో మృతి చెందింది. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి బాత్రూమ్లో ప్రాణాలు విడిచింది. ఈ వేడుకలో యువతి నృత్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషాదకర సంఘటన ఆదివారం (మే 4) రాత్రి బదౌన్ జిల్లాలోని ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ పినోని గ్రామంలో చోటుచేసుకుంది. వధువు, ఆమె కుటుంబ సభ్యులు తమ జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఒకటైన పెళ్లి కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. అప్పుడే హల్దీ కార్యక్రమం పూర్తయింది. ఇల్లంతా నవ్వులు, సంగీతం, నృత్యాలతో కళకళలాడుతోంది.
NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !
హల్దీ వేడుక ముగిసిన తర్వాత, వధువు తన స్నేహితులు, బంధువులతో ఆనందంగా నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్నవారు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, యువతిని రక్షించలేకపోయారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు గుండెపోటు వచ్చి ఉండవచ్చని వైద్యులు తెలిపారు.
నేడు ఉదయం వరుడి పెళ్లి ఊరేగింపు (బారాత్) రావలసి ఉంది. పెళ్లికి వధువును అందంగా అలంకరించిన పల్లకిలో పంపించాల్సిన చోట, ఆమె పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం మోసుకెళ్లాల్సి వచ్చింది. వధువు హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె తల్లి షాక్ , దుఃఖంతో స్పృహ కోల్పోయింది. పెళ్లికి హాజరయ్యేందుకు పట్టు వస్త్రాలు ధరించి వచ్చిన బంధువులు అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక నివాసి ఒకరు మాట్లాడుతూ, “ఆ అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఆమెకు ఇలాంటి దురదృష్టకర మరణం సంభవిస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు” అని అన్నారు.