దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. దీపావళి టపాసులు కాల్చడం అంటే చిన్నారులకు ఎంతో సరదా. అందుకే దీపావళి రోజు టపాసులు కొనిపించాలని తల్లిదండ్రుల దగ్గర పిల్లలు మారం చేస్తుంటారు. కానీ ఈ వెలుగుల నింపే పండగలో కొన్ని అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. టపాసులు కాల్చే సమయంలో గాయపడటం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటివి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం. కానీ పిల్లల చేత క్రాకర్స్ కాల్పించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Read Also: క్రేజ్ అంటే ఇదేరా… మార్కెట్లో జగన్ ఆటం బాంబులు
ముఖ్యంగా చిన్నారులు పెద్దల కళ్లు కప్పి వారికి ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్లి టపాసులు కాలుస్తుంటారు. అయితే డ్రైనేజీల మీద, డ్రైనేజీ కప్పుల మీద టపాసులు ఎట్టి పరిస్థితుల్లో కాల్చకూడదు. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వీడియోలో కొందరు చిన్నారులు డ్రైనేజీ కప్పు మీద టపాసులు వెలిగిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగుతాయి. దీంతో పిల్లలందరూ వెంటనే చెరో దిక్కుకు పారిపోయి తమ ప్రాణాలను రక్షించుకుంటారు. ఎందుకంటే డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి. డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని పెద్దలే పిల్లలకు తెలియజేయాలి.