సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత్ మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి… కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీ ఆమోదం విషయంలోనూ పెద్ద రచ్చే జరిగింది.. ఇక, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచి బీజేపీ నేతల వరకు పలువురు ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు మొదట్లో ఆరోపణలు రాగా.. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ట్విట్టర్ సెగ తగిలింది.. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. ట్విట్టర్ ఇండియా ఎండీపై బదిలీ వేటు వేసింది ఆ సంస్థ… ట్విట్టర్ ఇండియా ఎండీగా ఉన్న మనీష్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేసింది ఆ సోషల్ మీడియా దిగ్గజం…
అయితే, ఇప్పటి వరకు ట్విట్టర్ ఇండియా హెడ్గా ఉన్న మనీష్ మహేశ్వరి కొత్త మార్కెట్లపై దృష్టి సారించడానికి రెవెన్యూ స్ట్రాటజీ మరియు ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ పాత్రలో అమెరికాకు వెళ్లబోతున్నారు.. ఇక, మనీష్ మహేశ్వరి బదిలీని ట్విట్టర్ కూడా ధృవీకరించింది.. గత రెండేళ్లుకు పైగా భారత్లో మా వ్యాపారంలో మీ నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని.. మనీష్ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ ఓ పోస్ట్ చేసింది.. ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్ల కోసం అన్వేషణ.. ఆదాయ వ్యూహం, కార్యకలాపాల బాధ్యత వహించే మీ కొత్త పాత్రకు అభినందనలు అని కూడా పేర్కొంది.