టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ కు భారీ ఊరట లభించింది. పూరి, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చేసింది. పూరి, తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లును రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షించారు. 2017 జులైలో పూరి, తరుణ్ నుంచి నమూనాలను ఎక్సైజ్ శాఖ సేకరించిన విషయం తెలిసిందే. స్వచందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ పేర్కొంది.
గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సమర్పించింది. కెల్విన్ పై ఛార్జ్ షీట్ తో పాటు వివరాలు కోర్టుకు ఎక్సైజ్ సమర్పించింది. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు ఎక్సైజ్ సమర్పించింది. ఇక ప్రధాన నిందితుడు కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్ కు కోర్టు ఆదేశించింది. ఇక తరుణ్ సెప్టెంబర్ 22న ఈడీ ముందు హాజరు కావాల్సిఉండగా.. తాజాగా ఇచ్చిన క్లీన్ చిట్ తో హాజరు అవుతారా.. లేదా? అనేది తేలాల్సి వుంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు వ్యవహారం అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్తో మొదలైన ఈడీ విచారణ.. తనీష్ వరకు కొనసాగింది. బ్యాంక్ లావాదేవీలు, ముఖ్యంగా కెల్విన్ తో సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మనీలాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘనపై ఆరా తీశారు.