ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించిన విషయం తెలిసింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే తెలంగాణలోకి కూడా ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ అనుకున్నదానికంటే శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇది థర్డ్వేవ్కు ప్రారంభ సూచన అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా వచ్చే కొద్ది రోజుల్లో అత్యధిక కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 90శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని, 10 శాతం మందికి మాత్రమే లక్షణాలు బయటపడుతున్నాయన్నారు. అయితే ఆ 10 శాతం మంది వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. కానీ అప్రమత్తంగా మాత్రం ఉండాల్సి బాధ్యత ఉందని ఆయన అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి, వైద్యశాఖకు సహకరించాలని ఆయన కోరారు.