గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ రోజు జీహెచ్ఎంసీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు. మేయర్ ఛాంబర్లోకి ఒక్కసారి దూసుకెళ్లి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దీంతో మేయర్ ఛాంబర్ రణరంగంగా మారింది. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్పొరేటర్లను మేయర్ ఛాంబర్ నుంచి బయటకు పంపించారు.
అంతేకాకుండా మేయర్కు వ్యతిరేకంగా పోస్టర్లను అతికించారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు వీలు లేకుండా అభివృద్ధికి మేయర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మేయర్ స్పందించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.