కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే శ్రీరామ రక్ష అని నిపుణులు పదే పదే చెప్పుతున్నారు. ముఖ్యంగా రెండు డోసుల వాక్సిన్ వేసుకున్న వాళ్లు కరోనా నుంచి 99 శాతం రక్షణ పొందుతున్నారని సర్వేలు తేల్చాయి. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది వాక్సిన్ తీసుకొని వారే ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అంతేకాక మొదటి డోస్ మాత్రమే తీసుకున్న వారిలో 30 శాతం మందికి కరోనా వస్తోందని చెప్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల డోసులు సరఫరా చేశారు. 75 శాతం మందికి మొదటి డోస్ ఇవ్వగా.. 39 శాతం మందికి రెండో డోస్ పూర్తైంది. ఇంకా 36 లక్షలకు పైగా రెండో డోసు తీసుకోవాల్సినవారు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 లక్షల వాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోనివారు ఉన్నారు. వీరికోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది వైద్యశాఖ. ఇక, రష్యా, యూకేలో కరోనా మళ్లీ బుసలు కొడుతుంది. వ్యాక్సిన్ తీసుకొని వారే టార్గెట్గా అటాక్ చేస్తోంది. దీంతో అక్కడా మరణాలు పెరుగుతున్నాయి. ఆ పరిస్థితి తెలంగాణలో రాకుండా ఉండేందుకు అందరికీ వ్యాక్సిన్ అందించే విధంగా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది.