సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇవాళ కీలక పరిణమాలు చోటుచేసుకున్నాయి.. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. ఓ వైపు అరెస్ట్లు చేస్తుంటే.. మరోవైపు దిద్దిబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తెలుగు అకాడమీ డైరెక్టర్పై వేటు వేసింది.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీ డైరెక్టర్ (ఫుల్ అడిషనల్ ఛార్జ్ )గా ఉన్న సోమిరెడ్డిని ఆ బాధ్యతల నుండి తప్పించింది ప్రభుత్వం.. ఇక, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు తెలుగు అకాడమీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు.. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసింది సీసీఎస్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ పద్మావతి, ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగి మోహినుద్దీన్ను అరెస్ట్ చేశారు.. తాజాగా ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణరాజును కూడా అరెస్ట్ చేశారు.. తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల బదలాయింపులో సత్యనారాయణ కీలక సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా, ఇప్పటి వరకు తెలుగు అకాడమీకి చెందిన రూ. 60 కోట్ల ఎఫ్డీలను దారి మళ్లించినట్లుగా పోలీసులు గుర్తించినట్టు చెబుతున్నారు.