సింగరేణి 561వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. స్థానికులకే ఉద్యోగ అవకాశాలతో పాటు.. కొత్త ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది… సింగరేణి పరిధిలోని జిల్లాల వారికి శుభవార్త చెప్పారు సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్.. ఇకపై సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లాల వారికే ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. సింగరేణిలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంట్ డీపీఆర్కు ఆమోదం లభించిందని ప్రకటించిన ఆయన.. మందమర్రిలో 50 వేల టన్నుల సామర్థ్యం గల పేలుడు పదార్ధాల ప్లాంటు ఏర్పాటుకు కూడా ఆమోదం వచ్చిందన్నారు.. ఇక, తెలంగాణ చేనేత సొసైటీ ద్వారా కార్మికులకు యూనిఫాంల కొనుగోలుకు అంగీకారం తెలిపామన్నారు.. సింగరేణి 561వ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు సీఎండీ ఎన్.శ్రీధర్
Read Also: Etela Rajender: భయంతో పీకేని తెచ్చుకున్నారు.. మీ ఓటమిని ఆపలేమని ఆయనే చెప్పాడట..!
మొత్తంగా 2X600 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) సంస్థ ఏర్పాటు చేయాలనుకున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ జనరేషన్ యూనిట్కు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన 561వ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఎస్టీపీపీ 800 మెగావాట్ల డీపీఆర్కు ఆమోదం లభించింది. జైపూర్ మండలం పెగడపల్లిలో ప్రస్తుతం ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో ఈ యూనిట్ను రూ. 6,790 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రం యొక్క పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రస్తుత థర్మల్ ప్లాంట్ ప్రతి సంవత్సరం సుమారు రూ.500 కోట్ల లాభాన్ని ఆర్జిస్తున్నందున కొత్త యూనిట్ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని మరింత స్థిరీకరిస్తుంది. ఇక, స్థానికులకు గరిష్ట ఉపాధి లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా SCCL రిక్రూట్మెంట్లో స్థానిక రిజర్వేషన్ను కూడా బోర్డు ఆమోదించింది. నాలుగు పూర్వ జిల్లాల ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ మరియు వరంగల్ స్థానికులకు సవరించిన రిజర్వేషన్ ప్రకారం.. అధికారులు మరియు కార్మికులు (ఇతర) వర్గాలకు వరుసగా 60 శాతం, 80 శాతం కోటా కాకుండా 95 శాతం స్థానికులకే ప్రయోజనం చేకూరనుంది. ఇక, SCCL ఉద్యోగాల్లో స్థానికులకు సవరించిన రిజర్వేషన్పై ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నారు.. దీంతో పునర్వ్యవస్థీకరించబడిన 16 జిల్లాల స్థానికులకు ప్రయోజనం చేకూరబోతోంది.. ఎగ్జిక్యూటివ్ (ఆఫీసర్), NCWA (జాతీయ బొగ్గు వేతన ఒప్పందం) ఉద్యోగాలలో 95 శాతం కోటా పొందుతారు. మిగతా 5 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు.
మరోవైపు, నామినేషన్ పద్ధతిలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (టీఎస్సీఓ) నుంచి యూనిఫాం కోసం ఫ్యాబ్రిక్ కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ అధికారులు తెలిపారు. కంపెనీలోని గనులు మరియు ఇతర విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు యూనిఫాం సరఫరా కోసం సుమారు రూ.2 కోట్ల విలువైన ఫ్యాబ్రిక్ కొనుగోలు చేయనున్నారు.. ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకాల లక్ష్యాన్ని చేరుకోవడానికి మైనింగ్ కార్యకలాపాలకు పేలుడు పదార్థాలను సజావుగా సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిసి మందమర్రిలో ఏడాదికి 50,000 టన్నుల సామర్థ్యంతో పేలుడు పదార్థాల యూనిట్ను ఏర్పాటు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దీని కోసం మణుగూరు, రామగుండం ప్రాంతాల్లో పేలుడు పదార్థాల యూనిట్లను ఏడాదికి 50,000 టన్నుల నుంచి లక్ష టన్నులకు విస్తరించేందుకు బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది.