మంత్రి కేటీఆర్పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చకు మేము సిద్దం అన్నారు.
2014 నుండి వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చకు సిద్దం. తేదీ చెప్పండి … చర్చిద్దాం. కాంగ్రెస్ రైతుల గురించి ఆలోచన చేసిందా అని టీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ ఏం చేసిందో కేటీఆర్ కి తెలియదు. గుంటూరు, పూణెలలో ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయనకి తెలియదు. 350 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసింది కాంగ్రెస్. నాణ్యమైన ఉచిత విద్యుత్ 7 గంటలు ఇచ్చింది కాంగ్రెస్. కనీస మద్దతు ధర ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది . అదనంగా బోనస్ ఇచ్చింది కాంగ్రెస్. మేము ఏం చేశామో చర్చకు సిద్దం తేదీ మీరే నిర్ణయించండి అన్నారు రేవంత్ రెడ్డి.
2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ఏం చేసిందో చర్చ కు సిద్దం. 2014 నుండి 2022 వరకు కేసీఆర్ ఏం చేశారో చర్చ చేద్దాం. ఏబుల్ లీడర్ షిప్ అని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. మేము రైతు బజార్ లు తెస్తే… కెసిఆర్ ఊరూరా లిక్కర్ షాప్ లు తెచ్చారు. ఏడున్నర ఏళ్ళలో పేదల నుండి 1లక్ష 50 వేల కోట్లు దోచారు. రైతు బంధు పేరుతో మీరు ఇచ్చింది 50 వేల కోట్లు అన్నారు రేవంత్.
తులసి వనం లెక్క ఉన్న తెలంగాణ నీ గంజాయి వనం లెక్క మార్చేశారు. ఎక్కడ చూసినా గంజాయి కనిపిస్తుంది. కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో ఎకరం కి కోటి రూపాయలు వస్తుంది అని చెప్పాడు. కేసిఆర్ ఫార్మ్ హౌస్ లో గంజాయి ఏమైనా పండిస్తున్నడా..? లాభ సాటి వ్యవసాయం చేస్తే.. కెసిఆర్ రైతుల్ని ఫార్మ్ కి తీసుకెళ్ళి అవగాహన కల్పించండి అన్నారు రేవంత్ రెడ్డి.
రైతు బీమా కింద లబ్ది పొందింది 70,500 మంది రైతులే. వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్క 75,014 మంది చనిపోయారు అని లేఖ రాసింది. మూడున్నర ఏళ్ళలో 75 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం తెలంగాణనే. మీ అధికారిక ప్రకటనే చెప్తుంది ఎన్ని రైతు బలిదానాలు జరిగాయి అనేది. చనిపోయిన రైతుల చావుల మీద చర్చ చేద్దామా..? రైతు బంధు సంబరాలు అంటా..? రైతు ప్రభుత్వం అయితే వెళ్దాం పద రైతుల దగ్గరికే. సిరిసిల్ల రైతు వేదికల్లో చర్చకు సిద్దం. ప్రగతి భవన్ లో అయినా చర్చకు సిద్దం. అమర వీరుల స్తూపం దగ్గర అయినా మేము రెడీ అని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి.కేటీఆర్ సవాల్ చేస్తాడు. కోర్టుకి వెళ్తాడు. డ్రగ్స్ గురించి మాట్లాడితే కోర్టుకు పోయాడు. ఇప్పుడైనా వస్తావా చర్చకు. కేటీఆర్ ఒంట్లో తెలంగాణ రక్తమే ఉంటే చర్చకు రా రెచ్చగొట్టారు రేవంత్.