దేశంలోని బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. డిసెంబర్ 31తో ముగియనున్న కేవైసీ అప్డేట్ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కెవైసీ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు బ్యాంకులకు తమ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
Read Also: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర
మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002 ఆధారంగా ఖాతాదారులు కేవైసీ అప్డేట్ చేయాలని 2016లో ఆర్బీఐ దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది. కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే కాకుండా నగదుతో ముడిపడి ఉన్న అన్ని లావాదేవీలకు కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది. రిస్కు తక్కువగా ఉన్న ఖాతాలకు ప్రతి పదేళ్లకు ఒకసారి కేవైసీ అప్డేట్ చేయాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఎక్కువ రిస్క్ ఉన్న అకౌంట్ కలిగిన ఖాతాదారులు ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీని అప్డేట్ చేయాలి. ఎక్కువ కాలం పాటు ఇన్యాక్టివ్లో ఉన్న, రీయాక్టివేట్ కావాల్సిన బ్యాంకు ఖాతాలు కూడా కేవైసీని అప్డేట్ చేయాలి. ఒకవేళ కేవైసీ అప్డేట్ చేయకపోతే భవిష్యత్లో కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు చేయకుండా బ్యాంకులు నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి.