బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డికి ఆర్.కృష్ణయ్య ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు ఇచ్చిన నాటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తన ఫోన్ నంబర్ను సోషల్ మీడియాలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజులుగా అయితే ఈ కాల్స్ మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: కొత్త మద్యం పాలసీ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు గత రెండు రోజుల్లో తనకు వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆర్.కృష్ణయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫోన్ల వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని హోంమంత్రి, డీజీపీకి వినతిపత్రం ఇచ్చానని ఆయన వెల్లడించారు. కొన్ని శక్తులు తనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాయని.. తాను భయపడే రకాన్ని కాదన్నారు. గత 40 ఏళ్లుగా తాను బీసీల అభ్యున్నతికి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.