అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు ఇష్టమని, ‘టక్ జగదీశ్’ మూవీని కూడా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీశామని చెప్పాడు.
కానీ కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోకపోవడం, నిర్మాతలకు ఉన్న ఇబ్బందులు… వీటన్నింటి దృష్ట్యా నిర్ణయాన్ని వారికే వదిలేశానని అన్నాడు. అయితే… నిర్మాతలు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ కు అంగీకరిస్తే… మొదట ఆనందించేది తానే భావనను నాని ఈ లేఖలో ఇన్ డైరెక్ట్ గా తెలిపాడు. నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా, తాను సహకరిస్తానని, ఫైనల్ గా నిర్ణయాధికారం ప్రొడ్యూసర్స్ కే ఉంటుందని అన్నాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఎలా విడుదలైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పాడు. మరి నాని ఓపెన్ లెటర్ తర్వాత ప్రొడ్యూసర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి!
చిత్రం ఏమంటే… గత యేడాది కూడా కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా… ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు… నాని, సుధీర్ బాబు హీరోలుగా నిర్మించిన ‘వి’ మూవీ ఓటీటీలోనే విడుదల చేశారు. కానీ ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. అయితే… ఈ యేడాది ప్రారంభంలో దాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేసినా స్పందన కరువైంది. ఈ చేదు అనుభవం దృష్ట్యా ఓటీటీ కంటే… ‘టక్ జగదీశ్’ను థియేటర్లలో ముందుగా విడుదల చేస్తేనే బెటర్ అని భావనతో నాని ఉన్నట్టు తెలుస్తోంది.