NTV Telugu Site icon

సీఎం ఎక్కడుంటే అదే రాజధాని.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా నడుస్తూనే ఉంది.. ఏ క్షణంలోనైనా విశాఖకు రాజధాని తరలిపోవచ్చు అని చెబుతూ వస్తున్నారు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. అయితే, ఇవాళ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో కలిసి పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని తెలిపారు.. అది పులివెందుల కావొచ్చు, విజయవాడ కావొచ్చు.. రేపు మరో ప్రాంతం కావొచ్చు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రెటరియేట్.. అదే రాజధాని అన్న మంత్రి మేకపాటి.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

ఇక, చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని వెల్లడించారు మంత్రి మేకపాటి.. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారులు పరిష్కరిస్తున్నారన్న ఆయన.. గ్రామ సచిలయాలు, రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేసి చర్యలు చేపట్టాం.. ఏపీకి కొత్త పరిశ్రమలు రానున్నాయి.. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించిన ఆయన.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం అన్నారు.