వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన టీడీపీ ఆ పనిని సరిగ్గా నిర్వర్తించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో తప్ప టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదనే భావన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. దీంతో ఆపార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం క్రమంగా ఆపార్టీ గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొట్టగా మరికొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ముందస్తుగానే అలర్ట్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే టీడీపీ వచ్చే ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే సాహసం చేయదని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గత కొద్దిరోజులుగా పొత్తులపై ఇలాంటి సంకేతాలనే ఇస్తున్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని టీడీపీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.
టీడీపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరోవైపు టీడీపీలో ఒకరిద్దరు నేతలకు మినహాయించి మిగిలిన నేతలకు ఇటీవల ప్రాధాన్యం లభించడం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ముందుగానే జనసేనలో కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ జిల్లాల్లో జనసేన బలంగా ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లను జనసేనను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఈ జిల్లాల్లోని టీడీపీ నేతల సీటుకు ఎసరు వచ్చే ప్రమాదం నెలకొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు ముందుగానే జనసేన వైపు చూస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ నేతలు ముందుగానే జనసేనలోకి వెళ్లి తమ సీటును ఖరారు చేసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా టీడీపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. కాకినాడ రూరల్, రాజానగరం నియోజకవర్గ నేతలు ఇప్పటికే టీడీపీ గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని టాక్ విన్పిస్తోంది. వైసీపీని ఓడించాలంటే జనసేనలోకి వెళ్లడమే ఉత్తమమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాలకు చెందిన నేతలు జనసేన వైపు చూస్తున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటుకే పరిమితమైనా గోదావరి జిల్లాలో మాత్రం మంచి ఓటు బ్యాంకును దక్కించుకొంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థానాలను దక్కించుకుంది. దీనికితోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిరోజలుగా జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో జనసేనపై ప్రజల్లో క్రమంగా నమ్మకం పెరుగుతోంది. జనసేన-టీడీపీ పొత్తు ఖరారు కాక ముందే ఆపార్టీ నేతలు ముందుగానే ఆపార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండటం విశేషం. అయితే ఈ ఏరియాల్లో జనసేన బలంగా ఉండటంతో పవన్ కల్యాణ్ వీరికి ఆశ్రయం కల్పిస్తారా? లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.