హైదరాబాద్ కు తలమానికమయిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ప్రారంభం అయింది. నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమా కోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వసతులను, ఏర్పాట్లను సీఎం కేసీఆర్, జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించారు. ప్రాంగణాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణకు అప్పగించారు సీఎం కేసీఆర్. ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూమి కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన అందరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
