తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామన్నారు వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలి, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.
దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హరీశ్ రావు అన్నారు. మన దేశంలో కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కరోనా, కొత్త వేరియంట్ వ్యాప్తి, ప్రభావం ఎప్పటికపుడు గమనిస్తూ ఉండాలన్నారు. దీనిపై రోజు వారీ పరిశీలన చేసేందుకు ప్రత్యేకంగా కమిటీ నియమించాలని ఆదేశించారు.
కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్, మూడో వేవ్ సన్నద్ధత పై బి అర్ కే భవన్ లో వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సమీక్ష చేపట్టారు. సమీక్షలో సీఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడిసి ఎండి చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త వేరియంట్ రూపంలో మూడో వేవ్ ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. 27, 996 పడకలకు గానూ 25, 826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పూర్తి అయ్యిందన్నారు. మిగతా పడకలకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో మందుల నిల్వలను నిర్వహించాలని సూచించారు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వాలకు తోడుగా, ప్రజలు వారి బాధ్యతలు నిర్వర్తించ వలసి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచడం జరిగిందన్నారు. రెండో డోసు పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పక్కగా పాటించాలని, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పక పాటించాలన్నారు.