దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా ? పెరుగుతున్న కేసులతో జాగ్రత్తలు తీసుకోకపోతే…భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా ? ప్రధాన నగరాల్లో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసులే…ఇందుకు కారణమా ? కేసులు పెరగకుండా…ప్రభుత్వాలు జాగ్రత్తలు పడుతున్నాయా ? కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా ? నిన్న మొన్నటివరకూ 10 వేల లోపే వున్న కరోనా కేసులు 50 వేలు దాటాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత్లో కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో నమోదవుతున్న కేసుల్లో…50 శాతం దక్షిణాఫ్రికా వేరియంట్వే ఉంటున్నాయ్. దీనికి తోడు వారం రోజుల్లో…కరోనా, ఒమిక్రాన్ కేసులు…ఊహించని విధంగా పెరిగిపోయాయ్. వారం క్రితం 7వేల కేసులు నమోదైతే…ప్రస్తుతం 35వేల దాటాయ్. దీంతో నిపుణులు…దేశంలో థర్డ్ వేవ్ స్టార్టయినట్లేనని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల…థర్డ్ వేవ్కు సూచికంటున్నారు. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…80 శాతం మందికి వైరస్ అటాక్ అయిందని చెబుతున్నారు. దీనికి తోడు 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని అంటున్నారు.
ఒమిక్రాన్ కేసులు పెరుగుదలతో…రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయ్. వైరస్ నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు…సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు…ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా సీరో సర్వే నిర్వహించనున్నాయ్. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు…ఆంక్షలు విధించాయ్. దేశరాజధాని ఢిల్లీలో మూడు రోజుల్లోనే 10వేల కేసులు వెలుగు చూశాయ్. ఇప్పటికే ఎల్లో అలర్ట్ను జారీ చేసిన కేజ్రీవాల్ సర్కార్…తాజాగా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. వీకెండ్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది.
అటు పంజాబ్ సర్కార్ సైతం…స్కూళ్లు, కాలేజీలను మూసివేసింది. ప్రత్యక్ష తరగతులను రద్దు చేసిన సీఎం చన్నీ…ఆన్లైన్లో క్లాసులు కొనసాగించవచ్చని సూచించారు. రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది. మెడికల్, నర్సింగ్ కాలేజీలకు మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, యుపీ, పశ్చిమ బెంగాల్, గోవా సర్కార్ సైతం…నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయ్.