కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. ఏపీలోనూ ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా రక్కసి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు.. ఇప్పటికే పలువురు సీని, రాజకీయ ప్రముఖులు కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్నారు.
అయితే వైద్యులకు సైతం కరోనా సోకుతుండడం ఆందోళన కలిగించే విషయం. కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతోంది. ఈ కాలేజీలో ఇప్పటివరకు 22 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణైంది. అయితే తాజాగా మరో 7గురికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన కళాశాల ప్రిన్సిపాల్ కాలేజీలో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా కాలేజీకి ఈ నెల 17వరకు సెలవులు ప్రకటించారు.