సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. యూపీలోని జెవార్లో నిర్మించ తలపెట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. నోయిడాలో నిర్మించబోతున్న ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదని, దీని ద్వారా ఈ ప్రాంతానికి రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు లక్షమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటూ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, అర్జున్ రామ్ మేఘవాల్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు ఓ విమానాశ్రయ ఫోటోలు షేర్ చేశారు.
నిజానికి కేంద్ర మంత్రులు షేర్ చేసినవి మన దేశంలో ఎయిర్ పోర్ట్ ఫోటోలు కానేకాదని, అవి బీజింగ్లోని డాగ్జింగ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఫొటోలని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అది బీజేపీ కాదని, ‘బీజింగ్ జనతా పార్టీ’ అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో గ్రామాలు నిర్మించుకోవడానికి అక్కడి బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుంటే, ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం చైనా విమానాశ్రయాన్ని తనదిగా చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు లొంగిపోయిన ప్రభుత్వం లడఖ్లో మన భూభాగాన్ని ఆ దేశానికి అప్పగిస్తోందని ఆరోపించారు.
एशिया के सबसे बड़े एयरपोर्ट के रूप में नोएडा इंटरनेशनल एयरपोर्ट अपने साथ 35000 करोड़ रुपये का निवेश भी लाने जा रहा है। इससे एक लाख से अधिक लोगों को रोजगार उपलब्ध होगा और क्षेत्र में विकास की गति भी तेज होगी। pic.twitter.com/YokeYkz5Le
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) November 25, 2021
మరోవైపు, బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలపై చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టెలివిజన్ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటోలు బీజింగ్లోని డాగ్జింగ్ అంతర్జాతీయ ఫొటోలని స్పష్టం చేసింది. ఈ ఎయిర్ పోర్ట్ రచ్చ అంతర్జాతీయంగా వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి మరి.