నేడు టీడీపీ అధినేత కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయని ఆయన అన్నారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయని, కుప్పంలో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. వెయ్యి, రెండు వేలు పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని, కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే….మిమ్మల్ని అన్నట్లు కాదా..? అని వ్యాఖ్యానించారు. మనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా..? మనం బాగా పనిచేయాలి.. కుప్పంలో కోవర్ట్ లను పంపేస్తా.. ప్రక్షాళన చేస్తా అని ఆయన అన్నారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు.. మేము అనుకుంటే ఇంట్లోంచి బయటకు రాలేరని ఆయన మండిపడ్డారు.
కుప్పంలో మనం అంతా ఏకం ఐతే పోలీసులు ఏమి చెయ్యగలరని, కుప్పంలో కార్యకర్తల ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటానన్నారు. కుప్పంలో మీరు వద్దన్న నేతలను, నష్టం చేసే వారిని ఉపేక్షించనన్నారు. నేను నియోజకవర్గం మార్చలా.. ఆ అవసరం ఉందా..? నేను కుప్పానికి ముద్దు బిడ్డను.. కుప్పం వదిలి ఎక్కడికి పోను అని ఆయన అన్నారు. అవతలివాళ్లు కుప్పంపై హేళన చేస్తే నాకు బాధకలిగిందని, కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబును సభలో చూడాలని జగన్ అన్నాడని ఆయన గుర్తు చేశారు. చివరికి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి ఆనందం పొందుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్ళీ సీఎంగానే శాసనసభ కు వెళ్తా అని చెప్పాను. సభా గౌరవం కాపాడుతా. ప్రతిపక్షం పట్ల తమిళనాడులో స్టాలిన్ ఎంత గౌరవంగా ఉన్నారు.. ఇక్కడ జగన్ ఎలా ఉన్నాడు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా.. ఏ కార్యకర్త పై ఒక్క దెబ్బపడినా.. నా పై పడినట్లే. క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టను అని ఆయన హెచ్చరించారు.