తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది.. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరిపోయారు.. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు.. రేపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర నిర్వహించనున్నారు.
ఇక, రోజుకు మినిమం 10 కిలోమీటర్లు పాద యాత్ర చేయనున్నారు బండి సంజయ్.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ పరిధిలోనే ఆయన పాదయాత్ర కొనసాగనుంది.. రేపు రాత్రి మెహిదీపట్నంలోని పుల్లా రెడ్డి కాలేజ్లో బసచేయనున్న ఆయన.. ఎల్లుండి రాత్రి బాపు ఘాట్ దగ్గర బస చేస్తారు.. రేపు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుండి ప్రారంభం అయ్యే యాత్ర.. మదినా, అఫ్జల్ గంజ్, బేగం బజార్, ఎంజే మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వరకు తొలిరోజు బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. కాగా, బండి సంజయ్ పాదయాత్ర ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి యాత్ర కోసం ఒకసారి అయితే.. యూపీ మాజీ సీఎం మృతితో రెండోసారి వాయిదా పడింది సంజయ్ పాదయాత్ర.