ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శుభవార్త చెప్పింది.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ సంస్థ భారత్ బయోటెక్తో పాటు.. ఆ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ఎంతో కాలంగా డబ్ల్యూహెచ్వో అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇక, ఇవాళ అందరికీ శుభవార్త చెప్పింది డబ్ల్యూహెచ్వో.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్కు అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)కు ఆమోదం తెలిపింది.. భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఆరు వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి.. కోవిషీల్డ్, స్పుత్నిక్ వీతో పాటు భారత దేశవ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమంలో కోవాగ్జిన్ను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసర వినియోగ అనుమతుల కోసం అవసరమైన అన్ని పత్రాలను జూలై 9 నాటికి భారత్ బయోటెక్ సమర్పించిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్ష ప్రక్రియను ప్రారంభించిందని జులైలో రాజ్యసభకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. అక్టోబర్ 18న, డబ్ల్యూహెచ్వో.. కోవాగ్జిన్పై భారత్ బయోటెక్ నుండి అదనపు సమాచారాన్ని ఆశిస్తున్నట్లు తెలిపింది, దీనిని డబ్ల్యూహెచ్వో నిపుణులు అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది.. ఇక, ఆ తర్వాత ఆరోగ్య సంస్థకు భారత్ బయోటెక్ సమర్పించడంతో.. మళ్లీ పరిశీలన మొదలుపెట్టిన ఆ సంస్థ.. చివరకు అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చింది. కాగా, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొన్ని దేశాలు అనుమతి ఇవ్వడం లేదు.. ఇప్పుడు డబ్ల్యూహెచ్వో పచ్చజెండా ఊపడంతో.. ఆ ఆంక్షలు తొలగిపోనున్నాయి.. కోవాగ్జిన్ టీకా వేయించుకున్నవారి కూడా విదేశీ ప్రయాణం చేయడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడనుంది. అంతేకాదు.. కొన్ని దేశాలు కోవాగ్జిన్ టీకాలు దిగుమతి చేసుకోవడానికి కూడా వెనుకడుగు వేశాయి.. ఇప్పుడు డబ్ల్యూహెచ్వో నిర్ణయంతో.. కోవాగ్జిన్ ఎగుమతులు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.