NTV Telugu Site icon

వాళ్లకు సిగ్గు, లజ్జ ఉందా : నందమూరి చైతన్య కృష్ణ

ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని, నా భార్య శీలాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నారంటూ సభలోంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుపెట్టుకున్నారు.

అప్పటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనజ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ నేతృత్వంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సందర్బంగా నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్దికోసం మహిళలను కించపరిచేలా మాట్లాడుతా.. మీకు సిగ్గు, లజ్జ ఉందా అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

అంతేకాకుండా మా తాత ఎన్టీఆర్‌ మహిళలలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారని.. ఇలా మాట్లాడితే రాజకీయాలకు మహిళలు వస్తారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, కొడాలి నానికి పదవుల్లో కొనసాగే అర్హత లేదని వారిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా వైసీపీ నుంచి మేము స్టేట్‌మెంట్‌ కోరుతున్నామన్నారు.