శుక్రవారం నాడు హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక అఫిడవిట్లను సమర్పించింది. పాలన వికేంద్రీకరణ రద్దు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అఫిడవిట్లను ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఈ అంశాలపై గతంలో పిటిషన్ దాఖలు చేసిన వారికి అఫిడవిట్ల కాపీలను ప్రభుత్వం పంపింది. ఈనెల 22న అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్డీఏ బిల్లు చట్టాన్ని ఉపసంహరించుకుని బిల్లులు ఆమోదించినట్లు ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఇదే బిల్లులను ఈనెల 23న శాసనమండలిలో కూడా ఆమోదించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Also: నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు: నారా భువనేశ్వరి
ఈనెల 22న వికేంద్రీకరణ బిల్లుపై అభిప్రాయం చెప్పాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అఫిడవిట్లను దాఖలు చేసినట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. రెండు బిల్లుల కాపీలను అఫిడవిట్లతో జతచేసి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ హైకోర్టుకు సమర్పించారు. ఈ చట్టాలను అసెంబ్లీలో ఉపసంహరించుకున్నట్లు మాత్రమే కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లును చట్టసభల్లో ఆమోదించారు కాబట్టి తగు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది.