తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కేఆర్ఎంబీకి లేఖలు రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా.. వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ అక్రమంగా వాడేస్తోందని దీనిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటిని వాడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్న ఏపీ సీఎం.. ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.
ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాల విషయంలో కృష్ణా నదీయాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ లాంటి యంత్రాంగాలు ఉన్నప్పటికీ తెలంగాణ యథేచ్చగా నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని లేఖలో పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.. తక్షణం తెలంగాణ చేస్తున్న నీటి వినియోగాన్ని నిలువరించకపోతే ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయన్న ఆయన.. విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి చెందాల్సిన నీటి వాటా విషయంలో నష్టపోవాల్సి వస్తుందన్నారు.. సాగునీటికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. దీని వల్ల రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగుతోందన్నారు.. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసి.. తెలంగాణ విద్యుత్ ను ఉత్పత్తి చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.. జూన్ 1 తేదీ నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని పేర్కొన్న ఆయన.. ఉమ్మడి ప్రాజెక్టులపై సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించేలా ఆదేశించాలని లేఖలో ప్రధాని మోడీని కోరారు..