ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం, వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాలకు ముందుగా ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. ఇక ఈ బడ్జెట్ సమావేశం అనంతరం మండలి చైర్మన్ కు శాసన మండలి సభ్యులు వీడ్కోలు పలకనున్నారు. ఈనెలాఖరులో మండలి చైర్మన్ పదవీకాలం ముగియనున్నది. అయితే, అసెంబ్లీ సమావేశాలను ఒక్కరోజుకే పరిమితం చేయడాన్ని తప్పుడు పడుతూ సమావేశాలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. రూ.2.25 నుంచి 2.30లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నది. అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో హోమ్ శాఖామంత్రి సుచరిత వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.