గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి భారత్తో పాటు ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుటికే 50 దేశాలకు పైగా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఇటీవల భారత్లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ను ఎదుర్కునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనాలు మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో కోవిడ్ 19 టీకా బూస్టర్ డోస్తో 70 నుంచి 75 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలను అదుపులోకి తీసుకురావచ్చని యూకే నిర్వహించిన ఓ ఆధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ టీకా బూస్టర్ డోస్ వేసుకుంటే ఒమిక్రాన్ నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ప్రకటనలు చేసింది.