నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్… ‘వారాహి’కి పూజలు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్నారు జనసేనాని.. ఇక, పవన్ కల్యాణ్ కొండగట్టు, ధర్మపురి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి కొండగట్టుకు బయల్దేరనున్నారు పవన్.. ఉదయం 11 గంటలకి కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుంటారు.. జన సేనాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. పవన్ కల్యాణ్కు కొండగట్టు అంజన్న అంటే సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే.. పలు సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు.. దీంతో, వారాహికి కొండగట్టులోనే వాహన పూజ నిర్వహించాలని నిర్ణయించారు.. ఉదయం 11 గంటలకు మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకు చేరుకోనున్న పవన్.. అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారాహి ప్రచార రథానికి పూజలు చేయిస్తారు.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంటకు కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్లో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులతో సమావేశం అవుతారు.. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణపై ముఖ్య నాయకులకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆయన.. ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్రగా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభిస్తారు.. ఇక, సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్న పవన్ కల్యాణ్.. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం..
హైదరాబాద్ శివారులో కాల్పులు కలకలం సృష్టించాయి.. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ దగ్గర ఓ వైన్ షాపు యజమాని బెదిరించి.. అతని దగ్గర ఉన్న డబ్బుతో ఉడాయించారు.. మేడ్చల్ జిల్లా ఉద్దిమర్రి దగ్గర ఈ ఘటన జరిగింది.. ఉద్దమర్రిలో మద్యం షాపు నిర్వహిస్తోన్న బాలకృష్ణ అనే వ్యక్తి.. రాత్రి వైన్షాపును మూసివేసి తిరిగి వెళ్తున్న సమయంలో.. దుండగులు ఎటాక్ చేశారు.. తుపాకీతో బెదిరించారు.. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తోంది.. ఆ తర్వాత కర్రలతో బాలకృష్ణపై దాడి చేశారు.. అతడి దగ్గర ఉన్న రెండు లక్షల రూపాయాలతో పారిపోయారు.. ఇక, బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు.. కాల్పుల ఘటనపై పేట్ బషీర్బాగ్ ఏసీపీ రామలింగరాజు మాట్లాడుతూ.. మద్యం షాపు దగ్గర కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారని.. మూడు రౌండ్లు కాల్పులు జరిపి, కర్రలతో దాడి చేసి రెండు లక్షలు ఎళ్తుకెళ్లారని తెలిపారు.. దోపిడీకి పాల్పడిన సమయంలో దుండగులు మంకీ క్యాప్స్ ధరించి ఉన్నారని వెల్లడించారు.. కాల్పుల ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అయితే, హైదరాబాద్ శివారులో జరిగిన ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
శ్రీవారి భక్తులకు గమనిక.. నేడు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షిణం కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోని భక్తులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్లోని క్యూ వద్దకు చేరుకోవాలి. అక్కడ టికెట్, ఐడీని చెక్ చేసిన అనంతరం భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు. అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె, పైన కండువా, స్త్రీలు చీర, లంగా వోణీ వంటివి ధరించాలి. మిగతా ఎలాంటి దుస్తులు ధరించినా అనుమతించరు. అంగప్రదక్షిణం టోకెన్లు తీసుకున్న మహిళలు, పురుషులకు దర్శనానికి వెళ్లే సమయంలో వేర్వేరు వెయిటింగ్ హాళ్లలోకి ప్రవేశం ఉంటుంది. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత భక్తులను అంగప్రదక్షిణానికి అనుమతినిస్తారు. తెల్లవారుజామున 2:45 గంటలకు తొలుత మహిళలను, ఆ తర్వాత పురుషులను అంగప్రదక్షిణానికి పంపుతారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన మహిళలు వెండి వాకిలి వద్దకు చేరుకున్నాక పురుషులను అనుమతిస్తారు. అంగప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తారు. కాగా బాలాలయం పనుల కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేసినట్టు పేర్కొంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు బుక్ చేసుకోవాలని కోరింది.
నేడు మూడో వన్డే.. మరో క్లీన్ స్వీప్పై టీమిండియా కన్ను
సొంతగడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్లను గెలుస్తున్న టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను కూడా భారత్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈ వన్డేలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. తొలి వన్డేలో కష్టపడి గెలిచిన రోహిత్ సేన రెండో వన్డేలో మాత్రం పూర్తి ఆధిపత్యం చూపించింది. మరి మూడో వన్డేలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్ ఇండోర్లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. బ్యాటింగ్ పరంగా భారత్కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. కాకపోతే మిడిలార్డర్లోని ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సత్తా చూపించడం లేదు. ఓపెనర్లు లేదా వన్డౌన్లో విరాట్ కోహ్లీ చెలరేగితేనే భారత్ భారీ స్కోర్లు చేస్తోంది. టాపార్డర్ విఫలమైతే మిడిలార్డర్ ఏం చేస్తుందో ఇటీవల పెద్దగా కనిపించలేదు. శ్రీలంకపై రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ న్యూజిలాండ్తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. మరి మూడో వన్డేలో ఏం చేస్తాడో చూడాలి. ఈ మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్, చాహల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి కోసం ఎవరు త్యాగం చేస్తారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
సినిమా స్టోరీకి మించి ట్విస్ట్.. కోట్లు దోచింది.. ప్లాస్టిక్ సర్జరీతో తప్పించుకుంది.. కానీ..!
ఓ బ్యాంకు దోపిడీ కేసు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు.. తాను పనిచేస్తున్న బ్యాంకుకు కోట్లాది రూపాయలు కన్నం వేసిన మహిళ.. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని.. పారిపోయింది.. మరోప్రాంతానికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది… పెళ్లి చేసుకుంది.. వ్యాపారవేత్తగా కూడా ఎదిగింది.. కానీ, చేసిన పాపం ఊరికే పోతుందా.. 25 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కింది.. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1197లో చెన్ వైల్ 26 ఏళ్ల యువతి.. యెకింగ్ నగరంలో చైనా కన్ స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్కుగా పనిచేసేది.. బ్యాంకులోని లోపాలను గుర్తించిన ఆమె.. క్రమంగా బ్యాంకు ఖాతాల నుంచి తన ఖాతాలో 3.98 మిలియన్ యువాన్లను అంటే రూ. 4.77 కోట్లు మళ్లించింది.. నగరంలోని వివిధ బ్యాంకు శాఖల నుండి తన ఖాతాకు సొమ్మును మళ్లించింది.. ఇక, ఆ తర్వాత పోలీసుల నుండి తప్పించుకోవడానికి.. ప్లాన్ చేసిన ఆమె.. ప్లాస్టిక్ సర్జరీతో తన రూపాన్ని మార్చుకుంది.. ఇక, ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి, 1.43 మిలియన్ యువాన్లను (రూ. 1.71 కోట్లు) బిల్డింగ్ చుట్టూ, బహిరంగ టాయిలెట్తో సహా వివిధ ప్రాంతాల్లో దాచింది. ఆ తర్వాత ప్రావిన్స్కి వెళ్లి 2.1 మిలియన్ యువాన్లను (రూ. 2.52 కోట్లు) ముగ్గురు తోబుట్టువులు కొత్తగా సృష్టించిన జాయింట్ బ్యాంక్ ఖాతాల్లోకి పెట్టారు. అయితే, ఆమె తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు.. తిరిగి వచ్చి, తన నేరాన్ని అంగీకరించమని ఒత్తిడి తెచ్చారు.. కానీ, అదనపు డబ్బును బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవడానికి పాస్బుక్లను వారికి అందజేసింది వెళ్లిపోయింది.. తన మొదటి భర్తను సొంత ఊరిలోనే వదిలి.. ప్రావిన్స్ నుండి షాంఘైకి పారిపోయి.. జియాంగ్ పేరుతో కొత్త ఐడీ కార్డును పొందింది.. అక్కడ పేరు మార్చుకోవడమే కాదు, పెళ్లి కూడా చేసుకుని ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు గతంలో ఓసారి పెళ్లయినా, ఆ విషయాలేవీ చెప్పకుండా, కొత్త రూపురేఖలతో రెండో పెళ్లి చేసుకుంది. కాలక్రమంలో ఆమె వ్యాపారవేత్తగా ఎదిగింది. అయితే, పోలీసులు 1997 నుంచి ఆమె కోసం వెదుకుతూనే ఉన్నారు. ఏమైతేనేం, ఇటీవల ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై పలు అభియోగాలతో కేసులు నమోదు చేశారు. ఆమె తన నేరాన్ని అంగీకరించింది మరియు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అవినీతి, మోసం మరియు తన మొదటి వివాహాన్ని రద్దు చేసుకోకుండా మరో పెళ్లి చేసుకున్న కేసులో ఆమెపై విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు..
మోదీపై డాక్యుమెంటరీ.. బీబీసీపై విచారణకు పిటిషన్..
ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చకు దారి తీసింది. యూకే-ఇండియా సంబంధాలపై ప్రభావం పడేలా ఉండటం ఉంది. మరోవైపు యూకే, ఇండియాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉండగా ఈ డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేయడంపై అక్కడి ఎంపీలు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ఈ వీడియోను బ్యాన్ చేసింది. వలసవాద మనస్తత్వానికి నిదర్శనం ఈ డాక్యుమెంటరీ అంటూ భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే యూకే ఎంపీ ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యానించారు. మరో ఎంపీ కూడా ఇదే విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ యూకేలో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ డాక్యుమెంటరీని ‘‘ ప్రాపగండా జర్నలిజం’’ ఆరోపించింది. ప్రజలకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ డాక్యుమెంటరీని రూపొందించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిని తీవ్ర ఉల్లంఘనగా పేర్కొంటూ.. పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ గా దాని విధులను ఉల్లంఘించిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
వీడియో సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది…
మాస్ మహారాజ్ రవితేజకి బిగ్గెస్ట్ కంబ్యాక్ హిట్ గా నిలిచిన క్రాక్ మూవీ రికర్డులనే బ్రేక్ చేసిన సినిమా ‘ధమాకా’. రవితేజలోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా చూపించిన ఈ మూవీ, రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్లు రాబట్టిన ధమాకా సినిమా, రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రవితేజ్ ఎనర్జీ, శ్రీలీలా గ్లామర్, ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్. రవితేజ వన్ మ్యాన్ షో చేసిన ధమాకా మూవీ హిట్ క్రెడిట్ అందరికన్నా ఎక్కువగా ఇవ్వాల్సిందే మ్యూజిక్ డైరెక్టర్ ‘భీమ్స్ సిసిరీలియో’కే. రవితేజ అభిమానులకి కూడా ఎలాంటి అంచనాలు లేని ధమాకా మూవీని రిలీజ్ కన్నా ముందు ఆడియన్స్ దృష్టిలో పడేలా చేశాడు భీమ్స్. ధమాకా సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది ‘టైటిల్ సాంగ్’, ‘జింతాక జింతాక’, ‘దండ కడియాల్’, ‘వాట్స్ హ్యపెనింగ్’ సాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించాయి. ధమాకా సినిమాలో కూడా ఈ సాంగ్స్ సూపర్బ్ గా ప్లేస్ అవ్వడం, లీడ్ పెయిర్ డాన్స్ ఇరగదీయడంతో పాటలు వస్తున్న సమయంలో థియేటర్ లో ఆడియన్స్ కుర్చీలో కూర్చోకుండా డాన్స్ చేశారు. ఇక ధమాకా సినిమాని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లింది, క్లైమాక్స్ లో వచ్చే ‘పల్సర్ బైక్ సాంగ్’. ధమాకా మూవీ కన్నా ముందు యుట్యూబ్ లో సూపర్ హిట్ అయిన ఈ పల్సర్ బైక్ సాంగ్ ని, ధమాకా సినిమా క్లైమాక్స్ లో పెట్టడం రవితేజ, శ్రీలీల డాన్స్ తో దుమ్ము లేపడంతో ఆడిటోరియం ఒక్కసారిగా హై వోల్టేజ్ ఎనర్జీతో ఊగిపోయింది. ధమాకా సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ‘పల్సర్ బైక్’ సాంగ్ కూడా కారణమే. ఈ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. రవితేజ, శ్రీలీల సూపర్బ్ డాన్స్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి.