అమరావతి రీలాంచ్.. నేడే ఏపీకి ప్రధాని మోడీ
ప్రధాని మోడీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భారీగా ఏర్పాట్లుచేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు… మెయిన్ డయాస్ వెనకవైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోడీ పర్యటనపై ఏపీ మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, కొల్లు రవీంద్ర ఏర్పాట్లు, భద్రత, ప్రజలకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు. సభా ప్రాంగాణాన్ని ఇన్చార్జ్ డీజీపీ హరీష్ గుప్తా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రధాని మోడీ సభ, అమరావతి రీ లాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు, అధికారులు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నమన్నారు. సుమారు 5 లక్షల మంది మోడీ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు సభకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశారు. 11 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు, నల్ల బెలూన్స్ ఎగరేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ప్రధాని మోడీ అమరావతి పర్యటన.. వాహనదారులకు అలర్ట్
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అమరావతికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఉదయం 5 గంటలకే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాగా.. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండబోతున్నాయి..
ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు..
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. తాజాగా రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన దగ్గర ఉందని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దిలీప్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడు దుబాయ్కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. పక్కా సమాచారంతో దిలీప్ను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లొకేషన్ ద్వారా అతడి కదలికలపై నిఘా పెట్టిన సిట్ బృందం.. చెన్నై ఎయిర్పోర్టులో ఉన్నట్లు గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకుంది.
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట.. తాడిపత్రిలో హై టెన్షన్..!
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టులో ఊరట దక్కింది.. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో… ఆ రోజు నుంచి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు పోలీసులు.. పోలీసులు తాడిపత్రిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని… జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి.. అయితే, తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు.. తాడిపత్రికి పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్ళొద్దని.. కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్ళాలని ఆదేశించింది.. మరోవైపు.. తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.. హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ జగదీష్ ను కలిసి ఒకటి, రెండు రోజుల్లో తాడిపత్రి వెళ్లేందకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధం అవుతుండగా.. తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది..
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశాలపై ఈ భేటీలో చర్చలు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హాజరయ్యేలా పార్టీ హైకమాండ్ సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై మాట్లాడనున్నారని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశం పార్టీకి వ్యూహాత్మక దిశను ఇవ్వనుంది. పహల్గామ్ దాడిపై కేంద్రం స్పందనపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా చెబుతుందని తెలుస్తోంది. భద్రతా పరిస్థితులపై పార్టీ దృష్టిని తెలియజేయనుంది.
మొయినాబాద్లో వీర రాఘవరెడ్డిపై దాడి.. వాతలు వచ్చేలా…!
గతంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి చేసి సంచలనం సృష్టించిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి తాజాగా మరోసారి దాడికి గురయ్యాడు. గురువారం (మే 1, 2025) కండిషన్ బెయిల్పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వస్తుండగా దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీర రాఘవరెడ్డి ఓ టీ స్టాల్ వద్ద ఆగగా, అక్కడికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో వీర రాఘవరెడ్డికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో దాడి చేసిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు. దేశంలో రామరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో అతడు ప్రచారం చేస్తున్నాడు. అయితే.. కేవలం పదో తరగతి పాసైన, ఫెయిలైన యువకులను తన సైన్యంలోకి రిక్రూట్ చేసుకుంటున్నాడు. ఈ సైన్యంలో చేరడానికి 5 కిలోమీటర్లు నడవగలగడం, 2 కిలోమీటర్లు పరిగెత్తగలగడం, 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండటం వంటి అర్హతలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నెలకు రూ. 20 వేల జీతం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం.. గవర్నర్ను కలవనున్న టీకాంగ్రెస్ నేతలు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో, టీకాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్భవన్లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో, బీసీ వర్గాలకు విద్య , ఉద్యోగ రంగాలలో మరింత న్యాయం చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఈ బిల్లు చట్టంగా మారేందుకు మార్గం సుగమం అయింది. ఈ సందర్భంగా టీకాంగ్రెస్ బీసీ నేతలు గవర్నర్ను కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అలాగే, ఈ బిల్లు అమలుకు సంబంధించిన తదుపరి చర్యలపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బీసీ వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మరింత కృషి చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
పహల్గామ్లో నరమేధం సృష్టించిన ముష్కరులు భారత్లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక అంచనాకు వచ్చింది. వారు పాకిస్థాన్కు వెళ్లలేదని.. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్లోని ఒక దట్టమైన అడవిలో ఉన్నట్లుగా పేర్కొంది. ఒక పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు తప్పించుకోగలిగారని తెలిపింది. ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని.. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కగా అందుతున్నాయని.. స్థానికులు వారికి సపోర్ట్గా నిలిచినట్లుగా దర్యాప్తు సంస్థ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో పట్టపగలు ఏకే 47 తుపాకులతో ముష్కరులు చెలరేగిపోయారు. హిందువులు టార్గెట్గా 26 మందిని టెర్రరిస్టులు కాల్చి చంపారు. పదులకొద్ది గాయపడ్డారు. అనంతరం ముష్కరులు దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రస్తుతం వారు ‘‘ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్’’ పరికరాలు ఉపయోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది. దీంతో వారంతా సులువుగా తప్పించుకుంటున్నారని స్పష్టం చేసింది.
హరిహర వీరమల్లు రిలీజ్ పై గందరగోళం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. కాగా ఈ సినిమాను మొదట ఈ ఏడాది మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింట్ అప్పటికి ఫినిష్ అవకపోవడంతో విడుదల వాయిదా వేశారు. ఆ తర్వాత మే 9న రిలీజ్ చేస్తామని మరో డేట్ ప్రకటించారు. చివరికి ఆ డేట్ కూడా రాదని తెలిసిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా మే 30న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మే 30న వస్తుంది అన్నది నిర్మాత చేతిలో లేదట . చిత్ర హీరో పవన్ కళ్యాణ్ కు చెందిన మూడు, నాలుగు రోజులు షూట్ పెండింగ్ ఉందట. అది అయితే గాని రిలీజ్ లెక్క తేలదు. మరోవైపు మే 30న విజయ్ దేవర కొండ కింగ్ డమ్ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఒకవేళ హరిహర వీరమల్లు వస్తే విజయ్ సినిమా వాయిదా వేయక తప్పదు. ఇప్పటికే పలుమార్లు రిలిజ్ వాయిదా వేసిన హరిహర వీరమల్లు రిలీజ్ పై గందరగోళం నెలకొంది.
24 గంటల్లో బీభత్సం.. నాని కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్
నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘హిట్ 3’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచానాలకు మించి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోగా.. చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తానికి నాని తన మాట నిలబెట్టుకున్నాడు.. హీరోగా నిర్మాతగా మరో సారి తనని తాను నిరూపించుకున్నాడు. ఇక దర్శకుడి గురించి మాట్లాడుకుంటే.. అర్జున్ సర్కార్ కేరక్టర్ ఇంట్రో నుంచే ఆ పాత్రపై ఆసక్తిని రేకెత్తించాడు శైలేష్ కొలను. ఇక జనం మెచ్చేలా తీసిన కూడా హింసత్మక సీన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. కానీ చివర్లో అడవి శేషు సడన్ ఎంట్రీ, ‘హిట్ 4’ అంటూ కార్తీ ఎంటర్ అవ్వగానే.. థియేటర్ దద్దరిల్లిపోయింది. మొత్తనికి హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడం విశేషం.. పార్ట్ 4 కూడా ఇంతకు మించి అనేలా ఉండబోతుందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బ్లాక్ బస్టర్ ‘హిట్ 3’ కి గత 24 గంటల్లో బుక్ మై షో లో 270.27K టిక్కెట్లు బుక్ అయ్యాయి. నేచురల్ స్టార్ కెరీర్లో ఇది అతిపెద్ద ఓపెనింగ్ అని చెప్పోచ్చు.
గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తోలి ఆట నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ టాక్ కు తగ్గట్టే కలెక్షన్స్ కూడా రాబట్టింది. రిలీజ్ అయిన కేవలం 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ ను అందుకుంది గుడ్ బ్యాడ్ అగ్లీ. విశ్వాసం సినిమా తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ రెండవ సారి రూ. 200 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 8 నుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకురానుండీ. మరోవైపు ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో సూపర్ హిట్ కలెక్షన్స్ రాబడుతోంది. నిన్న అజిత్ కుమార్ పుట్టిన రోజును పురస్కరించుకుని తమిళనాడు వ్యాప్తంగా హౌస్ ఫుల్ షోస్ తో నడించింది గుడ్ బ్యాడ్ అగ్లీ.