ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనలపై సీఎం సీరియస్.. కీలక ఆదేశాలు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం సమీక్షించారు. రెండు ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. అనంతపురం ఘటనలో తన్మయి అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా.. ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొద్దిమంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడడం దారుణమని అన్నారు. ఈ రెండు ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడాలని అన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇక, ఈ కేసుల్లో ప్రత్యేక శ్రద్ధతో పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని అన్నారు సీఎం చంద్రబాబు. మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు.
చంద్రబాబుతో కిషన్రెడ్డి లంచ్ మీటింగ్.. తాజా రాజకీయాలపై చర్చ
విజయవాడ పర్యటకు వెళ్లిన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ లంచ్ మీటింగ్లో పలు అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత చంద్రబాబు నివాసం నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లారు.. సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లనున్నారు కిషన్ రెడ్డి.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ వచ్చినందుకు సీఎం చంద్రబాబు లంచ్ కి పిలిచారని తెలిపారు.. కేంద్ర సహాయం, ఏపీకి రావాల్సిన ప్రాజెక్ట్ లపై చర్చించామని వెల్లడించారు.. ఇక, విజయవాడ పర్యటనకు వచ్చినందుకు మర్యాద పూర్వకంగా కలవడానికి సీఎం చంద్రబాబు పిలిచారని తెలిపారు.. మైనింగ్, ఇతర ప్రాజెక్ట్ లపై ఈ లంచ్ సమావేశంలో చర్చించమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. వాటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు.. తెలంగాణ రాజకీయాలపై కొద్దిసేపు చర్చించినట్టు సమాచారం..
ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు బయటకు రాకుండా చేస్తున్నారు..!
ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కేసు విచిత్రమైనది.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. గతంలో కేసు నమోదు చేయలేదట.. మళ్లీ జనవరిలో మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు. చాలాకాలంగా రాజకీయాలలో ఉన్నారు.. కాకాణిని కసబ్ ను, టెర్రరిస్టును తీసుకు వచ్చినట్లుగా తీసుకొచ్చారని మండిపడ్డారు.. కాకాణి కారు చుట్టూ పోలీసులు కాపలాగా ఉన్నారు. డీఎస్పీ కోర్టులోకి అడ్వకేట్ల కూడా వెళ్లనివ్వలేదు. ఇలాంటి నిర్బంధాలకు పైనుంచి వచ్చిన ఆదేశాలే కారణం అని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే సోమిరెడ్డి కేసు పెట్టించాడు. కాకాణిని ఇబ్బంది పెట్టాలన్నదే ప్రధాన ఉద్దేశం అని విమర్శించారు అంబటి..
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలింపు!
పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ గేటు ముందు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు వాహనాల్లో తరలించారు. ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం బస్ భవన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. బస్ పాస్ ఛార్జీలను పెంచినట్లు ఆర్టీసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత మూడేళ్లుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల పాస్ల ఛార్జీలను పెంచుతున్నట్లు పేర్కొంది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. తెలంగాణ ఆర్టీసీ 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లను పెంచింది. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ ధర రూ.1,400కు పెరగగా.. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర రూ.1,600కు పెరిగింది. లనే రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1,800కు పెరిగింది.
భర్తని చంపి సోనమ్ ఎలా తప్పించుకుంది.. పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది..?
హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లయిన కొన్ని రోజులకు భర్తతో కలిసి మేఘాలయ హానీమూన్కి వెళ్లిన భార్య, అతడిని దారుణంగా హత్య చేయించింది. రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ రఘువంశీ కిరాయి హంతకులతో హతమార్చింది. సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు కలిసి ఈ మొత్తం హత్యను ప్లాన్ చేశారు. మే 23న హత్య జరిగితే, జూన్ 2న మేఘాలయాలోని కొండల్లో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపూర్లో సోనమ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మే 23న మేఘాలయలోని నోంగ్రియాట్ గ్రామంలోని షిపారాలోని హోమ్ స్టే వద్ద చివరిసారిగా రాజా, సోనమ్ కనిపించారు. మే 11న రాజాతో వివాహం జరిగిన కొద్ది రోజులకే సోనమ్, రాజ్ కుష్వాహాలు కలిసి హత్యకు ప్లాన్ చేశారు. హత్య కోసమే మేఘాలయ హనీమూన్కి తీసుకెళ్లింది. సోనమ్, రాజాలు కలిసి ట్రెక్కింగ్ కోసం స్థానికంగా కొండల్లోకి వెళ్లిన సమయంలో ముగ్గురు హంతకులు ఆకాష్, ఆనంద్, వికాష్ వీరిని ఫాలో అయ్యారు. అలసిపోయినట్లు నటించిని సోనమ్ వీరి వెనక నడిచింది. నిర్జన ప్రదేశానికి వెళ్లిన తర్వాత, భర్తని చంపేయాలని ముగ్గురిని ఆదేశించింది.
భారతదేశ జనాభా 146 కోట్లు.. తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు..
2025 నాటికి భారతదేశ జనాభా 1.46 బిలియన్లకు (146 కోట్లు)కు చేరుకుందని ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనాభా నివేదిక పేర్కొంది. అయితే, దేశంలో సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ రేటు కన్నా తగ్గుతోందని వెల్లడించింది. UNFPA యొక్క 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ (SOWP) నివేదిక, ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్, సంతానోత్పత్తి తగ్గడం వల్ల కలిగే భయాందోళనల నుంచి పునరుత్పత్తి లక్ష్యాలను పరిష్కరించడం వైపు మారాలని పిలుపునిచ్చింది. లక్షలాది మంది ప్రజలు తమ నిజమైన సంతానోత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతున్నారని నివేదిక పేర్కొంది. తక్కువ జనాభా లేదా అధిక జనాభా నిజమైన సంక్షోభం కాదని, సంతానోత్పత్తి తగ్గడమే నిజమైన సంక్షోభమని యూఎన్ రిపోర్టు చెప్పింది. జనాభా కూర్పు, సంతానోత్పత్తి, ఆయుర్దాయం వంటి కీలక మార్పులను కూడా నివేదిక వెల్లడించింది. ఇది ప్రధాన జనాభా మార్పును సూచిస్తోంది. భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు స్త్రీకి 1.9 జననాలకు తగ్గిందని, ఇది 2.1 భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉందని నివేదిక కనుగొంది. దీని అర్థం, ఒక తరం నుంచి మరొక తరానికి జనాభా పరిమాణాన్ని నిర్వహించడానికి అవసరమైన దాని కన్నా తక్కువ పిల్లల్ని కంటున్నట్లు చెబుతుంది.
రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్బుక్ ప్రో ఆర్డర్.. పాత ల్యాప్టాప్ పంపిన ఫ్లిప్కార్ట్
ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఒక్క క్లిక్తో షాపింగ్ ఇంట్లోనే పూర్తవుతుంది. వంటింటి సామాను నుంచి లక్షలు విలువ చేసే వస్తువులను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. అయితే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి ఊహించని షాక్ తగులుతోంది. తాము బుక్ చేసుకున్న ఆర్డర్ కు బదులుగా సబ్బులు, పాత వస్తువులు వస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్బుక్ ప్రోను ఫ్లిప్ కార్టులో ఆర్డర్ చేశాడు. తీరా డెలివరీ అయ్యాక చూస్తే అది పాత ల్యాప్ టాప్ అని తేలింది. వెంటనే రిటర్న్ ఇచ్చాడు కస్టమర్. కానీ రెండోసారి కూడా పాత ల్యాప్ టాప్ రావడంతో ఫ్లిప్ కార్టు తీరుపై మండిపడ్డాడు ఆ యువకుడు. ఈ సంఘటన మొత్తం వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీ ఇంత పెద్ద మోసం ఎలా చేసిందని అందరూ ప్రశ్నిస్తున్నారు? ఫ్లిప్కార్ట్ కంపెనీ తనను ఒకసారి కాదు, రెండుసార్లు మోసం చేసిందని యువకుడు పేర్కొన్నాడు.
ఆర్సీబీ తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు..
బెంగళూర్లో ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట కేసులో అరెస్టులకు సంబంధించిన పిటిషన్లు విచారిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జవాబుదారీతనం కోసం కోర్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, దాని పర్యవసానాలపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తింది. కర్ణాటక ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని సూటిగా ప్రశ్నించింది. ఈ ఘటన దర్యాప్తును సీఐడీకి బదిలీ చేసినట్లు కోర్టుకు సమాచారం అందింది. అయితే, ఇప్పటి వరకు బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టులు చేసింది. నిందితులను కబ్బన్ పార్క్ పోలీసులు హాజరుపరుస్తున్నారు.
అమ్మకానికి ఆర్సీబీ టీమ్.. ఎన్ని కోట్లో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ యాజమాన్యం ‘డయాజియో’ ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట. ఆర్సీబీ జట్టును పూర్తిగా లేదా కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తమ కథనంలో పేర్కొంది. ఇప్పటికే డయాజియో ఆర్థిక సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,834 కోట్లు) ఉండొచ్చని అంచనా. అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ విక్రయంపై డయాజియా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆర్సీబీని అమ్మెందుకు ఓ కారణం ఉందట. ఐపీఎల్లో పొగాకు, ఆల్కహాల్ బ్రాండ్ల ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనల ప్రమోషన్ను నిషేధించాలని.. క్రికెటర్ల ద్వారా అనారోగ్యకరమైన ఉత్పత్తుల ప్రమోషన్ను ఆపాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒత్తిడి చేస్తోంది. డయాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం ఆల్కహాల్. భారత ప్రభుత్వ నిర్ణయాలు డయాజియో వ్యాపారానికి అడ్డంకిగా మారనున్నాయి. ప్రస్తుతం సోడా, మ్యూజిక్ సీడీలు వంటి పేర్లతో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది.
కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ డేట్ ను ప్రకటించారు మంచు విష్ణు. జూన్ 13న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఏ టైమ్ కు అన్నది అందులో స్పష్టంగా చెప్పలేదు. మూవీ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అంతా విష్ణు చుట్టూ కనిపించాయి. ప్రభాస్ కు సంబంధించి ఒక పోస్టర్ మాత్రమే వదిలారు. దీంతో ట్రైలర్ లో అయినా ప్రభాస్ ను చూడొచ్చిన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కూడా ఉండటంతో వారి ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం టీజర్ మాత్రమే వచ్చింది. పైగా విష్ణు మూవీకి భారీ హైప్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే మూవీ ఎలా ఉంటుందో అని ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ట్రైలరే మూవీకి హైప్ పెంచాలి. ఒకవేళ ట్రైలర్ బాగోకపోతే మూవీకి హైప్ రాదు.
‘కుబేర’కి దేవి శ్రీ టెన్షన్!!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా ప్రేక్షలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నర క్రితం మొదలైంది. సినిమా అనౌన్స్మెంట్ అయితే మూడేళ్ల క్రితమే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్తో ఉన్న అగ్రిమెంట్స్ కారణంగా ఆ విడుదల తేదీని మార్చలేని పరిస్థితి. అయితే సినిమా రిలీజ్కు ఇంకా పది రోజులుంది కానీ ఇంకా ఒక సాంగ్ పూర్తి కాలేదు, అలాగే సినిమా రీ-రికార్డింగ్ కూడా పూర్తి కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఏషియన్ సునీల్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక మరో మూడు రోజుల్లో సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ తర్వాత మరో రెండు రోజులకు మరో సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ కారణంగా ఎప్పుడూ సినిమాకు లాస్ట్ మినిట్ టెన్షన్ ఏర్పడినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.