మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ‘చిజారసీ టోల్ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు పంక్చర్ అయింది. వేరే కారులో వెళ్లిపోయా. అందరమూ సురక్షితంగా బయటపడ్డాం’ అని అసదుద్దీన్ ట్విట్టర్లో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను సమీక్షించింది. అలాగే వెంటనే అమలులోకి వచ్చేలా అతనికి CRPF యొక్క Z కేటగిరీ భద్రతను అందించిందనున్నట్లు వెల్లడించింది. కాగా.. ఒవైసీపై దాడి కేసులో ఇద్దరు షూటర్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలపై ఆగ్రహంతోనే దాడికి పాల్పడినట్టు కాన్వాయ్పై కాల్పులు జరిపిన నిందితులు యూపీ పోలీసులకు వెల్లడించినట్లు యూపీ అధికారులు పేర్కొన్నారు.