స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్ 8 పోలింగ్ స్టేషన్లు మొత్తం 937 ఓటర్లు ఉన్నారన్నారు. ఆదిలాబాద్లో ఒక్కో స్థానానికి ఇద్దరూ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. కరీంనగర్లో 8 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 1324 ఓటర్లు ఉన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది బరిలో ఉన్నట్టు తెలిపారు. మెదక్ 9 పోలింగ్ స్టేషన్ల పరిధిలో1026 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. నల్గొండలో 8 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 1271 ఓటర్లు ఉన్నారని, ఒక్కో స్థానానికి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. ఖమ్మం 4 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 768 ఓటర్లు ఉన్నారని, ఒక్కో స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. మొత్తంగా 5,326 ఓటర్లు.. 37 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఓటర్లు కరోనా నియమాలు పాటించాలని, తమ ఓటు హక్కును స్వచ్ఛందoగా వినియోగించుకోవాలని కోరారు. ఏకగ్రీవం అయిన జిల్లాలలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత పై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగిన ఘటన పై కలెక్టర్ దగ్గర నివేదిక తెప్పించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలుకు గురి చేసే వారిపై, క్యాంప్ రాజకీయాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని తెలిపారు.