తెలంగాణలో రైతు సంఘర్షణ యాత్రకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని వరంగల్లో ఈ సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పదేళ్ళ పాలనలో ఉన్నప్పటికీ, రాష్ట్రానికి పెద్దగా చేసిందేమీ లేదని ఆరోపించారు. అప్పుడు వ్యవసాయానికి మూడు విడతల్లో ఏడు గంటల కరెంట్ ఇచ్చారని, విత్తనాలు ఎరువుల కోసం చెప్పులు పెట్టి మరీ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
కానీ, ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళను పారిస్తున్నామన్నారు. 24 గంటల కరెంటు, కాళేశ్వరంతో సాగు నీళ్ళిచ్చి.. వ్యవసాయాన్ని నిలబెట్టామన్నారు. ఏడేళ్లలో 70 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు. తెలంగాణ వడ్లు కొనాలని కేంద్రమంత్రిని కోరితే.. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఆశతో రైతులు ఓటేస్తే ఒకరు మోసం చేశారు, అతనికి కచ్ఛితంగా రైతుల ఉసురు, శాపం తగులుతుందని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.