బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వరిపై మొదలైన మాటల యుద్ధం సవాళ్లు విసురుకునే దాకా వెళుతోంది. యాసంగి ధాన్యం సంగతేంటని ప్రశ్నించిన టీఆర్ఎస్.. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలకు పిలుపు ఇచ్చింది. నేడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు. రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. పంజాబ్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు కేంద్రాన్ని వెంటాడుతామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్ గా వర్షాకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ బీజేపీ నిన్న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల దగ్గర వద్ద ఆందోళనలు నిర్వహించింది.
Read Also: ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..!
వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించినా కూడా బీజేపీ నేతలు రైతులను ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మంత్రులు కౌంటర్ ఎటాక్ చేశారు. యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు. వచ్చే యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపుతో.. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాకు సిద్ధమవుతున్నాయి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఓవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని బీజేపీ తప్పు బడుతూ ఆందోళనలు నిర్వహిస్తుంటే.. మరోవైపు.. బీజేపీ కేంద్ర సర్కార్ను టార్గెట్ చేస్తోంది టీఆర్ఎస్.. ఇలా.. కేంద్రం వర్సెస్ రాష్ట్రం.. రాష్ట్ర వర్సెస్ కేంద్రం అనే విధంగా పరిస్థితి తయారైంది.