టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరికకు ఇప్పటికే అంతా సిద్ధమైంది. అయితే, అనుకోని కారణాలతో పలుమార్లు చేరిక వాయిదా పడుతు వస్తోంది. రేపో మాపో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ప్రగతి భవన్లో నిన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో టీఆర్ఎస్ సత్తా చాటాలని, అస్సలు వెనక్కి తగ్గొద్దని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దని, గట్టిగా పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ ప్రస్తావన వచ్చింది.
Read Also:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి: కేటీఆర్
రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం జూన్ వరకు ఉందని, ఈలోపు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అనర్హత వేటు వేయాలన్న ప్రతిపాదనను ఎంపీలు కేసీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అనర్హత వేటు కోసం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చ అనంతరం డీఎస్ కాంగ్రెస్లో చేరిన మరుక్షణం అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా డీఎస్కు టీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాతినిథ్యం లేని కారణంగా ఆయన సొంత గూటికీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు కొడుకు అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి కవితపై అరవింద్ పోటీ చేశారు. ఈ విషయం అప్పటి నుంచి డీ శ్రీనివాస్కు టీఆర్ఎస్లో ప్రాధాన్యతను తగ్గిస్తు వచ్చారు గులాబీ బాస్ కేసీఆర్.