పింఛన్లు, ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రక్షణ శాఖలో అగ్నిపథ్ తీసుకొచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నాలుగేళ్లకే రిటైర్ అవ్వడం అంటే పెళ్లికాగానే వితంతువు అయినట్లేనని ఆయన వర్ణించారు. నాలుగేళ్లలో 6నెలలు ట్రైనింగ్కే వెళ్తుందని.. ఆ 6 నెలల్లో ఏమి నేర్చుకుంటారని ప్రశ్నించారు. రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి సైనికులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆక్రోశం వల్లే యువకులు బులెట్లు తగిలినా వెనక్కి తగ్గలేదన్నారు.
డిఫెన్స్ నిధులకు కోత పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అదానీ పదింతలు పెరిగాడని.. ఎన్ని విధాలుగా సహకరిస్తున్నారని కేంద్రాన్ని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని అదానీకి తాకట్టుపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అగ్నిపథ్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు. అగ్నిపథ్ నేపథ్యంలో దేశమంతా అట్టుడుకుతోందన్నారు. ఏం చదువుకున్నాడో తెలియని ప్రధాని ఉండడం మన దురదృష్టకరమన్నారు. జ్ఞానం లేని వ్యక్తి చేతిలో దేశం అడుగంటుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. మతతత్వ విధానాలతో ఓట్లు అడిగే పరిస్థితి ఉందన్నారు.
ఆసుపత్రిలో ఉన్న సోనియాగాంధీ కూడా మద్దతు తెలిపి చనిపోయిన వ్యక్తికి సానుభూతి వ్యక్తం చేశారన్నారు. అగ్నిపథ్ వెనక్కి తీసుకోవాలని కార్యకర్తల నుంచి రాహుల్ గాంధీ వరకు కోరుతున్నామన్నారు. గతంలో మాదిరిగానే సైనిక నియామకాలు జరగాలని డిమాండ్ చేశారు. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబం దగ్గరకు కూడా అనుమతించలేదని ఆయన మండిపడ్డారు. శవంపై టీఆర్ఎస్ జెండాలు కప్పి ఊరేగింపు లాగా కాకుండా ఉత్సవాల లాగా చేసి రాజకీయం చేశారని మహేశ్కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress Satyagraha Deekhsa Live Updates : సత్యాగ్రహ దీక్ష లైవ్ అప్డేట్స్