ధైర్యం ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరంగల్ రావాలని సవాల్ విసిరారు MLA జగ్గారెడ్డి. అగ్నిపథ్ రద్దయ్యే వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అగ్నిపథ్ ఉద్యమం BJP పాలిత రాష్ట్రాలైన యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కాల్పుల ఘటనకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. మృతుడు రాకేష్ మృతదేహంపై తెరాస జండాను ఎలా కప్పుతారని ఆయన ప్రశ్నించారు. కరోనాతో బాధపడుతున్న సోనియాగాంధీ సైతం అగ్నిపథ్ విషయంలో పోరాటం చేస్తున్న యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిపారు. యువత ఎవరు కూడా తొందరపడి బలికావద్దని విజ్ఞప్తి చేశారు.
అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. పార్లమెంటులో బిల్లు పెట్టి చర్చించకుండా.. డిఫెన్స్లో కొత్త విధానాన్ని ఏవిధంగా తీసుకొస్తారని ప్రశ్నించారు. మోదీ క్షమాపణలు చెప్పి అగ్నిపథ్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.దేశాన్నిరక్షించే జవానుకే ఇప్పుడు కష్టం వచ్చిందని ఆరోపించారు. మోదీ తెచ్చే ప్రతి పథకం తన స్నేహితులు అదాని, అంబానీల కోసమేనని ధ్వజమెత్తారు. పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని నాలుగేళ్లకే తీసుకోవడం అన్యాయమన్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు, మాజీ మంత్రి గీతారెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి చిన్నారెడ్డి పాల్గొన్నారు.
అగ్నిపథ్ స్కీమ్ దేశంలోని యువతను చంపేస్తుందని.. ఆర్మీని అంతం చేస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శించారు. ఈ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని గమనించాలని.. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు. దేశానికి నిజమైన, దేశ ఆస్తులను కాపాడే ప్రభుత్వాన్ని తీసుకురావాలి. నిరసనలు ఆపొద్దు కానీ.. శాంతియుతంగా చేయాలి.
ప్రధాని మోదీ వల్లనే దేశంలో ఆందోళనలు చెలరేగాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఎక్కడ రామ మందిరం ఉందో అక్కడే చిక్చు మొదలైంది. ఆర్మీలో దేశ సేవ చెద్ధాం అనుకునే యువతకు ఉద్యోగాలు లేకుండా చేసే ప్రయత్నం. బీజేపీ చంపుతుంది.. టీఆర్ఎస్ శవయాత్ర చేస్తోంది. పోలీసులకు బలికాకండి..సోనియా గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కాపాడుకుంటారని అన్నారు.
సోనియాగాంధీ ఆదేశాలతో సత్యగ్రహ దీక్ష జరుగుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ గీతా రెడ్డి అన్నారు. అగ్నిపథ్పై పార్లమెంట్ లో చర్చించకుండా యువత జీవితాలతో చెలగటం అడుతున్నారని, మోడీ ప్రతి పథకం తన స్నేహితులు అదానీ, అంబానీలు కోసమేనని ఆమె ఆరోపించారు. శ్రీలంక లో కూడా మోడీ అదానీకి సహకరించేలా ఒత్తిడి చేస్తున్నారని, మాకు వద్దని రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారన్నారు. అగ్నిపథ్తో సైనికుల వ్యవస్థను కాంట్రాక్టు పద్ధతి చేస్తున్నారు.. దేశ భద్రతను ఫణంగా పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని 4 సంవత్సరాల వరకే తీసుకోవడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు.
ఉద్యోగాలు కావాలని తపనతో ఆందోళన చేస్తే కాల్పులు జరిపారని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సికింద్రాబాద్లో చనిపోయిన రాకేష్ కి సంతాపం తెలిపారు. అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా ఆందోళన జరుతున్నా.. అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అనేది తెలుసుకోలేక పోతుంది కేంద్రమని ఆయన మండిపడ్డారు. ఆర్మీనీ కూడా ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షకు మరికాసేపట్లో కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
పెన్షన్ ,ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రక్షణ శాఖలో అగ్నిపథ్ తీసుకొచ్చారని కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి సైనికులను అవమానిస్తున్నారు. నాలుగేళ్లకే రిటైర్ అవ్వడం అంటే పెళ్లికాగానే వితంతువు అయినట్టుంది. శవంపై టీఆర్ఎస్ జెండాలు కప్పి ఊరేగింపు లాగా కాకుండా ఉత్సవాల చేసి రాజకీయం చేశారు. జ్ఞానం లేని వ్యక్తి చేతిలో దేశం అడుగంటుతోంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్యా గ్రహ దీక్షకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా హాజరయ్యారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందన్నారు. రక్షణ శాఖలో కాంట్రాక్ట్ సిస్టం పనిచేయదని, అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చి 5 లక్షల కోట్ల పెన్షన్ ని సేవ్ చేసుకోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ స్కీం వల్ల రక్షణ శాఖలో 15 శాతం రిక్రూట్మెంట్ ఆగిపోతుందని, ఈ స్కీం వల్ల పాకిస్తాన్ చైనా నుంచి ముంపు పెరిగే అవకాశం ఉందన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆ యువకుల భవిష్యత్తు ఏంటని ఆయన ప్రశ్నించారు.

అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో దీక్ష ప్రారంభం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, వీ.హెచ్, రాములు నాయక్, మల్లు రవి, అనిల్ యాదవ్, సునీత రావు తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. అగ్నిఫథ్ స్కీమ్పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అగ్నిపథ్ను కేంద్ర వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్న దీక్ష.
ఢిల్లీలోని జంతర్ మంతర్ లో అగ్నిపథ్ స్కీమ్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సత్యాగ్రహ పేరిట నిరసన. కాసేపట్లో ప్రారంభంకానున్న సత్యాగ్రహ దీక్ష. జంతర్ మంతర్ లో జరిగే ఆందోళనకు హాజరుకానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ఎంపీలు, సీడబ్ల్యూసీ మెంబెర్లు,పార్టీ సీనియర్ నేతలు.
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో నిన్న దేశ యువతకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సందేశం. అగ్నిపథ్ ఉపహసంరించే వరకు పోరాడి యువత ప్రయోజనాలు కాపాడుకోవాలని లేఖ రాసిన సోనియాగాంధీ. అయితే.. జంతర్ మంతర్ లో షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.
అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్తో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టి విజయవంతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని గాంధీభవన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సత్యాగ్రహ దీక్షను తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టనున్నారు.