స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి… అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు తగ్గి..రూ. 57,350 వద్ద ఉండగా, అలాగే 24 క్యారెట్ల పసిడి ధర పై రూ. 10 తగ్గి.. రూ. 62,560 వద్ద ఉంది.. అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. కిలో వెండి పై రూ.100 తగ్గి రూ.75,400 గా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,700 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,340, 24 క్యారెట్ల ధర రూ.62,550, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,840, 24 క్యారెట్ల ధర రూ.63,100, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340, 24 క్యారెట్ల ధర రూ.62,550 గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,340, 24 క్యారెట్ల ధర రూ.62,550, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,340, 24 క్యారెట్ల ధర రూ.62,550 గా కొనసాగుతుంది.. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,340 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,550 గా ఉంది..
నేటి ఉదయం 11 వరకే మోడీ సర్కార్ కు డెడ్లైన్.. లేదంటే మళ్లీ రైతుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఇవాళ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉదయం 11 గంటలలోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి బయలుదేరుతామని రైతు సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సింగూ సరిహద్దుల్లోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు ఐదు వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, జీటీ రోడ్, సోనిపట్, ఢిల్లీలోని సింగు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్లను బద్దలు కొట్టడానికి శంభు సరిహద్దు దగ్గర పోక్లేన్, హైడ్రా, జేసీబీలను కూడా రైతులు ఏర్పాటు చేశారు.
24గంటల్లోనే మార్కెట్లో రూ.150తగ్గిన ఉల్లి ధర
పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుల ఇంటి బడ్జెట్ ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఓ వైపు వెల్లుల్లి రేటు రోజు రోజుకు కొండెక్కుతుంటే.. మరో వైపు నేనేం తక్కువ అంటూ కొండపైకి చూస్తోంది. ఇటీవల కాలంలో ఉల్లి ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. దీంతో సామాన్యులు మళ్లీ ధరలు పెరుగుతాయేమో అని భయపడ్డారు. అయితే ఇప్పుడు వారికి గొప్ప ఉపశమనం లభించింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్లో కేవలం 24 గంటల్లోనే ఉల్లి ధర క్వింటాల్కు రూ.150 తగ్గింది. ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. దాని కారణంగా ఉల్లి ధరలు పెరిగాయి. అయితే, మంగళవారం మధ్యాహ్నం వరకు దాని ధరలు తగ్గడం ప్రారంభించాయి.
దేశంలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న లాసల్గావ్ మండి. మంగళవారం మధ్యాహ్నం వరకు ఉల్లి ఎగుమతిపై నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. దీంతో ఉల్లి ధర పతనమై క్వింటాల్ రూ.150కి పడిపోయింది. అంతకు ముందు ఫిబ్రవరి 19న లాసల్గావ్ మండిలో టోకు ఉల్లి ధర క్వింటాల్కు 40.62 శాతం పెరిగి రూ.1,800కి చేరుకుంది. ఫిబ్రవరి 17న ఇదే ధర క్వింటాల్కు రూ.1,280గా ఉంది. ఉల్లి ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని మంగళవారం ప్రభుత్వం ప్రకటించడంతో వేలం ధర క్వింటాల్కు రూ.150 తగ్గి రూ.1,650కి చేరింది. ఈ క్రమంలోనే 8,500 క్వింటాళ్ల ఉల్లికి మార్కెట్లో డీల్ కుదిరింది.
నేటి నుంచి ఇంటర్ హాల్టికెట్ల జారీ.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు
ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఈ పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి జారీ చేయనుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. అయితే, ఇప్పటికే పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన ప్రతి స్టూడెంట్ హాజరును ఆన్ లైన్ ద్వారా తీసుకునేందుకు ప్లాన్ చేస్తు్న్నారు. పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్ను జతచేసి.. ఎక్సామ్ పేపర్ను ఎక్కడ ఫొటో తీసినా లేదా స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేందాల్లోకి ఫోన్లను నిషేదించారు.
కాగా, ఎక్సామ్ పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లో కూడా ఈసారి ఇంటర్ బోర్డు అందించే ప్రత్యేకమైన బేసిక్ ఫోన్ను మాత్రమే వినియోగించే ఛాన్స్ ఉంది. ఇది కేవలం ఇంటర్ బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్లను చూసేందుకే పని చేస్తుంది. తిరిగి సమాచారం ఇచ్చేందుకు, ఫోన్ చేసేందుకు ఈ ఫోన్ పని చేయ్యదు. పైగా ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పని చేస్తుంది. ఈసారి ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షల కోసం పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్లోకి తీసుకొచ్చింది.ప్రాక్టికల్స్ పూర్తైన వెంటనే మార్కులను ఆన్లైన్లో ఉంచారు.. దీని కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది.
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ!
పాకిస్తాన్ ఎన్నికలు 2024 ఫలితాలు వచ్చిన రెండు వారాల రోజుల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు చేపట్టనున్నారు.
మంగళవారం అర్థరాత్రి పీపీపీ, పీఎంఎల్ఎన్ నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఆ సమావేశంలో పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా, ఆసిఫ్ జర్దారీ అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించారు. పీపీపీ, పీఎంఎల్-ఎన్లు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను సాధించాయని.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర
తెలంగాణలో నేడు రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కొనసాగనున్నాయి. నారాయణపేట, మహబూబ్నగర్లో రోడ్ షోల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. నారాయణపేట పట్టణం శాసన్ పల్లి రోడ్, లక్ష్మీ ఫంక్షన్ హల్ లో ఉదయం 9గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ధన్వాడలో రోడ్ షో, స్థానిక మహిళలతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. దేవరకద్ర, లాల్ కోట క్రాస్ రోడ్స్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. తర్వాత కొత్త కోట నేత కార్మికులతో, కురుమ సంఘం నేతలతో కిషన్ రెడ్డి ముచ్చటించనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్.. నేటి నుంచి సర్దుబాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఇవాళ్టి నుంచి స్టార్ట్ అయింది. గత కొద్ది నెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో కొన్ని సచివాలయాల్లో ఎక్కువ, మరికొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దీంతో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు తప్పని సరిగా పని చేసేలా ప్రభుత్వం రేషనలైజేషన్ ఉద్యోగుల సర్దుబాటుకు రెడీ అయింది.
ఇక, 10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, జిల్లాలో సర్దుబాటు ప్రక్రియకు సంబంధించిన తేదీల వారీగా షెడ్యూల్ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్ ధ్యాన్చంద్ర జీవో జారీ చేశారు. రేపటి (ఫిబ్రవరి 22) వరకు జిల్లాల వారీగా 8 మంది కన్నా తక్కువ, ఎక్కువ పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందించనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు పని చేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగిరి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తించనున్నారు.
నేడు విశాఖకు సీఎం.. శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్న జగన్
ఏపీ సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నిన్న (మంగళవారం) కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ సీపీ ఫకీరప్ప ఏర్పాట్లపై పీఠం ప్రతినిధులతో సమీక్షించారు. నిన్న మధ్యాహ్నం ఎయిర్పోర్టు నుంచి శారద పీఠం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎంను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు వస్తుండటంతో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. చినముషిడివాడ ప్రధాన కూడలి నుంచి పీఠం వరకు రెయిలింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు, సీఎం హోదాలో నాలుగోసారి శారదా పీఠానికి వస్తుండటంతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం పలికేందుకు పీఠం ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, సీఎంను ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.