నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి షురూ అయ్యింది. నేడు గోల్కొండ కోట బోనమెత్తింది. బంగారు బోనానికి లంగర్ హౌజ్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. తొట్టెలకు స్వాగతం పలికి.. శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందని, ప్రతి ఆలయానికి ఆర్ధిక సాయం అందించిన ఘనత తెలంగాణదేనన్నారు.
జూలై 17, 18న సికింద్రాబాద్ లో బోనాలు నిర్వహిస్తామన్నారు. జూలై 24, 25న లాల్ దర్వాజ బోనాలు జరుగుతాయన్నారు. తెలంగాణ బోనాలు మన సంస్కృతికి అద్దం పడతాయని, కుల మతాలకు అతీతంగా బోనాలు నిర్వహిస్తామన్నారు. జూలై 10 వ తేదీన బోనాలు, బక్రీద్ వేడుకలు జరపనున్నట్టు వెల్లడించారు. అందరూ కలిసి అన్ని పండుగలు చేసుకోవాలని తలసాని సూచించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బోనాలకు పెద్ద పీట వేశారని తెలిపారు. తెలంగాణలో వైభవంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బోనాలు అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. బోనాల పండగను అందరం సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారన్నారు. తెలంగాణ సీఎం ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ప్రార్థించామన్నారు.
Andhra Pradesh: సత్తా చాటిన ఏపీ.. మరోసారి నెంబర్ వన్